ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.10 లక్షలను బాలుడి కుటుంబానికి అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు, కార్పొరేటర్ల జీతం నుంచి రూ.2 లక్షల రూపాయాలు కలిపి మొత్తం పది లక్షల రూపాయాలను కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి పరిహారంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. కుక్కల బెడదపై కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైదరాబాద్‌లో (GHMC) పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనలను  దృష్టిలో ఉంచుకుని జీమెచ్ఎంసీ అధికారులు కొన్ని మార్గదర్శకాలు జారీచేశారు.


ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో  నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ చనిపోవడం తెలిసిందే. తండ్రి పననిచేసే చోటుకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ కావడడంతో పిల్లల తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెగ్యూలర్ గా ఇలాంటి ఘటనలు జరుగుతన్నా జీహెచ్ఎంసీ ఏ చర్యలు తీసుకోలేదని.. కుక్కుల విషయాన్ని గాలికొదిలేయడంతో చిన్నారి చనిపోయాడంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 


కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం, మీ నిర్లక్ష్యం వల్లే అని వ్యాఖ్యలు


ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదివరకే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో పరిస్థితిని గ్రహించిన హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై తండ్రి పనిచేసే చోట వీధి కుక్కలు దారుణంగా దాడి చేయడం అమానుష ఘటన అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కుక్కల దాడిలో పసివాడు మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, మీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడంటూ హైకోర్టు మండిపడింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి16కి వాయిదా వేసింది.


నగరంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీధి కుక్కలు దాడులు పెరిగిపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. బాలుడు ప్రదీప్ మృతికి నష్ట పరిహారం చెల్లించడాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి16కి వాయిదా వేసింది.