Bhainsa RSS Rally : నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలన్న హైకోర్టు.. మసీదుకు 300 మీటర్లు దూరంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీలో పాల్గొనాలని కోర్టు సూచించింది. మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొంది. 


ఒక్క స్లోగన్ తో మతవిద్వేషాలు


అయితే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి భైంసా పోలీసులు అనుమతి నిరాకరించారు.  మార్చి 5న భైంసాలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికను ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. రెండు సంవత్సరాలు క్రితం భైంసాలో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని కోర్టుకు తెలిపారు. భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మకమైన ప్రాంతమని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. ఒక్క స్లోగన్ తో మత విద్వేషాలు చెలరేగుతాయన్నారు.  టిప్పు సుల్తాన్ బర్త్ డే ర్యాలీకు సైతం పోలీసులు అనుమతి ఇచ్చారని, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. భైంసా భారత దేశంలోనే ఉందని, బహిష్కరించిన ప్రాంతం కాదని పిటిషనర్ తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. 


ఆర్ఎస్ఎస్ ర్యాలీ 


ఫిబ్రవరి 19న భైంసాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 'పాద సంచలన్' (మార్చ్), 'షరీరిఖ్ ప్రదర్శన్'కు గతంలో హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే పట్టణ స్థాయిలో ‘శరీరిక్ ఉత్సవం’ ద్వైవార్షిక సాధన అని ఆర్‌ఎస్‌ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. సభ్యులు యూనిఫారాలు ధరించి, వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తారని, భౌతిక ప్రదర్శనలు, ప్రసంగాలు చేస్తారని తెలిపింది. 2011లో జనాభా లెక్కల ప్రకారం భైంసాలో 49,764 మంది నివసిస్తున్నారు. వీరిలో హిందువులు 49.06 శాతం ఉండగా, ముస్లింలు 46.94 శాతం ఉన్నారు.


భైంసా సున్నిత ప్రాంతం


నిర్మల్ జిల్లాలోని భైంసాలో 2021 మార్చి 7వ తేదీన అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లదాడి చేశారు. చిన్నగా మొదలైన గొడవ అల్లర్లకు దారితీసింది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, పోలీసులు కూడా ఉన్నారు.  భైంసా అల్లర్లలో తోటా మహేష్‌, దత్తు పటేల్ బైక్‌పై వెళ్తూ స్నేహితుడి నెత్తిపై కొట్టారని పోలీసులు చెప్పారు. ఆ ఘటనతో భైంసాలో అల్లర్లు మొదలయ్యాయని అప్పట్లో పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, సాక్ష్యాల ఆధారంగా అప్పట్లో 38 మందిని అరెస్ట్ చేశారు.