Cyberabad CP Avinash Mahanthi Press Meet: గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం వచ్చిందని.. అందుకే ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కొకైన్ పార్టీ వ్యవహారంలో మంజీరా గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానందను అరెస్ట్ చేశామని చెప్పారు. అతనితో పాటు నిర్భయ్, కేదార్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. ర్యాడిసన్ హోటల్ పై తాము కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఇక్కడి నిందితులకు సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు తెలిసిందని సీపీ వివరించారు. అతని కోసం వెతుకుతున్నామని.. వారు డేటాని డిలీట్ చేసినా.. రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


పట్టుబడిన వారిలో వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడని సీపీ చెప్పారు. ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని అన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ కు కూడా పాజిటివ్ వచ్చిందని అన్నారు. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించగా.. కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందని వివరించారు. మొత్తం ఈ పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు. వివేకా నంద, నిర్భయ్, కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వివరించారు. వారు డ్రగ్స్ ద్వారా సంపాదించినట్లు అనుమానిస్తున్నామని.. ఆ ఆస్తులను కూడా తాము అటాచ్ చేస్తున్నామని సీవీ అవినాష్ మహంతి తెలిపారు.