KCR Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లారు. సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో 9వ ఫ్లోర్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు తుంటి విరగడంతో యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి వెంట షబ్బీర్ అలీ, మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లిన తర్వాత తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, యశోద డాక్టర్లను కలిసి మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులు ఉన్నారు.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి రావాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. ఆయన సూచనలు, సలహాలు తమకు అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వైద్యానికి సంబంధించి అన్ని సహకారాలు అందించాలని సీఎస్‌ను ఆదేశించానని రేవంత్ అన్నారు. 






ఎన్నికల్లో ఓటమి ఎదురైన నాటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫామ్ హౌస్‌లో కేసీఆర్ జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ కేసీఆర్ పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల టీమ్ తుంటి మార్పిడి సర్జరీ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది.


కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి డాక్టర్లు కూడా నిన్న విడుదల చేశారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని అందులో భాగంగానే కేసీఆర్ శనివారం కొంత సమయం నడిచారని వైద్యుల బృందం తెలిపింది. ఈ మేరకు ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ నడిపించినట్లు చెప్పారు. కేసీఆర్‌ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ను నడిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.