Telangana CM Revanth Reddy New Canvoy: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం (డిసెంబరు 9) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి తన కొత్త కాన్వాయ్‌లో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం.. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటేనే కనీసం 5 నిమిషాల ముందు ఆ దారిలో ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అక్కడక్కడా కానిస్టేబుళ్లను నిర్దేశిత సమయం కంటే చాలా ముందు నుంచే మోహరిస్తారు. ఇతర లింకు రోడ్ల నుంచి ట్రాఫిక్ రోడ్డుపైకి రాకుండా చూసుకోవడం వారి బాధ్యత. అయితే, శనివారం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వైపుగా వెళ్తుండగా మాత్రం ఏ ప్రోటోకాల్ పాటించలేదు. 


సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపమా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.


అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం మరోలా ప్రచారం చేసుకుంటున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి ప్రజలతో కలిసిపోతున్నారని, అందులో భాగంగానే.. జనంతో కలిసి పోతున్నారని అంటున్నాయి. ప్రజా భవన్ లో ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. శనివారం అసెంబ్లీకి కూడా ప్రజల మధ్యలోనే కలిసి వెళ్లారని అంటున్నాయి. రేవంత్ రెడ్డికి సీఎం కాన్వాయ్‌ అంటే గ్రీన్‌ ఛానల్‌ అవసరం లేదంటూ చెబుతున్నాయి. అందుకే ఆయన కాన్వాయ్ గాంధీ భవన్‌ నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్‌ మధ్యలోనే సాగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


సీఎం రేవంత్ రెడ్డికి కొత్త కాన్వాయ్
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లకు 0009 నంబరు కేటాయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా ఈ కొత్త కాన్వాయ్‌లో ఆయన అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాన్వాయ్ లో కార్లకు నాలుగు ఆర్లు (6666) ఉండేవి. భద్రతా కారణాల రీత్యా సీఎం వాహన శ్రేణిలోని అన్ని కార్లకు ఇదే నెంబరు ఉంటుంది.