Bhatti Vikramarka Reviw meeting: హైదరాబాద్: డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయం ఫైనాన్స్ శాఖ కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు. సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్ తో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారరని భట్టి విక్రమార్క అన్నారు.


తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అయినప్పటికీ చాలెంజ్ గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అనేక సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారెంటీలు అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించినట్లు తెలిపారు. 


‘ఇండ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదివిన కొలువులు రాకపోవడంతో పెళ్లిళ్లలో క్యాటరింగ్ సప్లయర్స్ గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశాను. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలి. హ్యూమన్ రిసోర్స్ ను బలోపేతం చేసుకోవడం వల్ల జీడీపీ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశాం. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాము. ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నాం’ అన్నారు భట్టి విక్రమార్క.


మిగతా గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికారులు పనిచేయాలని మంత్రి భట్టి విక్రమార్క దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు ఉన్నారు. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సిబ్బందిని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి పరిచయం చేశారు.