తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని ఇటీవల చంద్రబాబు ఓ రోడ్ షోలో అన్నారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదుల సంఖ్యలో ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించారు. తాజాగా చంద్రబాబు మాటలను పటాన్ చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.


సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో ఓ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ కట్టనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 


హయత్ నగర్ - పటాన్ చెరు మెట్రో పొడిగింపు


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో పటాన్‌ చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్‌ చెరులో నివాస కాలనీలు బాగా పెరుగుతున్నాయని, ఇక్కడికి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ‘‘గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు అనేవారు. భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఏపీలో తగ్గాయి. ఇక్కడ ఎకరం అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు కొంటున్నారని చంద్రబాబే చెప్పారు.’’


పటాన్‌ చెరు ప్రాంతం ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో పటాన్‌చెరులో కరెంట్‌ కోసం సమ్మెలు చేసేవారు. కానీ, ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం 3 షిప్టుల్లో నడుస్తున్నాయి. పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్ని కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్‌, గృహాలకు, కమర్షియల్‌, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ. గతంలో ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపోయాం. 3.17 లక్షలతో పర్‌క్యాపిటా ఇన్‌కంలో దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుంది.


పరిశ్రమల వల్ల ఇక్కడ కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌ కు నలువైపులా 5 పెద్ద ఆస్పత్రులు తీసుకొచ్చే క్రమంలో భాగంగా పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తోంది. ఇందుకోసం రాజీవ్‌ శర్మ కృషి ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.


ఈ కార్యక్రమంలో మంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, టీఎస్ఎంఐడీ సీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial