Visakhapatnam - Secunderabad Vande Bharat Express: 


హైదరాబాద్: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్ రద్దు చేశారు అధికారులు. వాస్తవానికి నేటి (ఆగస్టు 17) ఉదయం 5 గంటల 45 నిమిషాలకు వందే భారత్ విశాఖ నుంచి బయలుదేరాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ పనుల కారణంగా చివరి నిమిషంలో సర్వీస్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ఐదు గంటల సమయంలో వందే భారత్ రద్దు విషయాన్ని అధికారులు ప్రయాణికులకు తెలిపారు. ఆకస్మికంగా సర్వీస్ రద్దు చేయడంతో వందే భారత్ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందే భారత్ రద్దు చేసిన కారణంగా మరో రైలును దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. రద్దు చేసిన సర్వీసుకు ప్రత్యామ్నాయంగా గురువారం ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశారు అధికారులు. వందేభారత్‌ స్టాపుల్లోనే ఈ రైలు ఆగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే వందే భారత్ సికింద్రాబాద్ చేరుకునే సమయంలోనే వెళ్తుందా, లేక ఎక్కువ సమయం పడుతుందేమోనని ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. మరో వందే భారత్ సమయానికే వెళ్తుందని, ఏ సమస్యా లేదని అధికారులు తెలిపారు.


తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.3,238 కోట్లతో రైల్వే పనులు 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 


ఇందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరు-బీబీనగర్‌ మార్గం డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్‌ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. అలాగే, రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో మేడ్చల్-ముద్ఖేడ్, డోన్-మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. డోన్-మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్‌ ద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. 


రైళ్ల రద్దీ, ప్రయాణ సమయం తగ్గిస్తూ, బొగ్గు, సిమెంట్ రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నెర్గుండి- బారాంగ్‌, కుర్దా రోడ్‌ - విజయనగరం మధ్య రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్‌ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి. 


దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ.32,500 కోట్లు అంచనా వ్యయం వేశారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌లను విస్తరించనున్నారు.