Water Supply In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో 30 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 19 ఉదయం 6 గంటల నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో 30 గంటలపాటు కుళాయి నీటికి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఎర్రగడ్డ, అమీర్‌పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట, ఎల్లారెడ్డిగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్ ప్రాంతాల్లో ఆగస్టు 19 ఉదయం 6 గంటల నుంచి 30 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. 


మంజీరా వాటర్ సప్లై ఫేజ్ – 2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్‌కు జంక్షన్ మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఆర్అండ్‌బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు ఆగస్టు 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 20 తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. 


దీంతో నగరంలోని పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఈ 30 గంటలపాటు నీటి సరఫరా ఉండదు. కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరింది. పనులు ముగిసిన వెంటనే నీటిని అందించనున్నట్లు పేర్కొంది. నీటి సరఫరా అంతరాయం ఏర్పండుతుందో ఆ కాలనీలవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.  


అంతరాయం ఏర్పడే ప్రాంతాలు



  • ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్. 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (ఈ ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఉంటుంది)

  • ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్. 8: ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.

  • ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్. 9: కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట.

  • ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్.15: ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్.

  • ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్. 24: బీరంగూడ, అమీన్ పూర్.