BRS Vs Congress: కాళే‌శ్వరం ఎందుకూ పనికిరాదని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు దాని ఆధారంగా తెలంగాణకు నీళ్లు అందిస్తున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌. ఇన్నాళ్లు దాంట్లో తప్పులు జరిగాయని అవినీతి రాజ్యమేలందని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు లెంపలేసుకోవాలని నిన్న ట్వీట్ చేసిన కేటీఆర్ ఇవాళ మరో ట్వీట్ పెట్టారు. 


పక్కనే గోదావరి పారుతున్నా ఎడారిగా మారిన తెలంగాణలో జలసిరులు పారించింది కాళేశ్వరమన్నారు. తెలంగాణ ఎండిపోతే సంతోషిద్దామన్న వాళ్ల కళ్లు అసూయతో నిండిపోయేలా దండిగా నీళ్లు పారించామన్నారు. అందులో ఉన్న చిన్న చిన్న లోపాలను బూతద్దంలో పెట్టి చూపి ప్రాజెక్టును మూలన పేడ్దామని చూశారని కేటీఆరోపించారు. 


తెలంగాణలో ఎత్తిపోతల తప్ప వేరే గత్యంతరం లేదని పాలకులు గుర్తించి మరోసారి మేడిగడ్డకు రిపేర్ చేసి నీళ్లు పారిస్తున్నారని గుర్తు చేశారు. నీళ్లు రాకుండా పోయిన ప్రాజెక్టులను చెరువులను కళకళలాడేలా చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే అన్నారు. 




కాళేశ్వరం కారణంగానే వేసవిలో కూడా చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో నీళ్లు పారేలా చేయడమే సంకల్పంగా పని చేశామని అందుకు కాళేశ్వరం నిదర్శనమన్నారు. కాళేశ్వరం ఒక బరాజ్ అంటూ కూతలు కూస్తున్నారని జలఫిరంగులు ఎక్కుపెట్టారు. కుళ్లు రాజకీయాలతో చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టగలమని... లోపాలను సరిదిద్దుకోగలమని అన్నారు. ఇంత చేస్తూ పార్టీలే ఏడుపే తమ ఎదుగుదలని కేటీఆర్ అభివర్ణించారు. 


వర్షాకాలం వరదకు మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతుందన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు లెంపలేసుకోవాలని అన్నారు కేటీఆర్‌. ఇన్నాళ్లు చేసింది చిల్లర రాజకీయమని కామెంట్ చేశారు. నిన్నటి దాకా మేడిగడ్డ మేడిపండులా మారిందని రిపేర్ చేయడం అసాధ్యమన్నారు. రిపేర్ చేసినా పనికి రాదన్నారు. లక్షకోట్లు వృథా అన్నారు. వర్షాకాల వరదకు కొట్టుకుపోతుందన్నారు. అన్నారం బ్యారేజీ కూడా పటిష్టంగా లేదన్నారు. ఇవాళ మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి చేశామంటున్నారు. అంటే ఇంతకాలం చేసింది విష ప్రచారమని తేలింది. కాలయాపనే అని రూఢీ అయింది. రిపేర్ల మాటున చిల్లర రాజకీయం ప్రజలు గుర్తించారని అన్నారు. 
కేసిఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన నేతలంతా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరప్రదాయినిపై విషం చిమ్మిన వాళ్లంతా లెంపలేసుకోవాలని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.