Telangana Job Calendar To Be Released Soon : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధపడుతోంది. ఇప్పటికే అధికారులు అందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అధికారులు కూడా జాబ్ క్యాలెండర్ కు సంబంధించి తుదిమెరుగులు దిగుతున్నట్లు చెబుతున్నారు.


వారం రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సి), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన షెడ్యూల్ తో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాక అధికారులు ఆ వివరాలను యూపీఎస్సీ, జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ, ఆర్ఆర్బి ఆర్ఆర్సి, బ్యాంకింగ్ వంటి ఇతర పోటీ పరీక్షల బోర్డులకు రాష్ట్రీయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగాలకు టీజీపీఎస్సీ షెడ్యూల్ సమయంలో ఇతర పరీక్షల అడ్డంకులను తొలగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర జాబ్ క్యాలెండర్ కూడా యూపీఎస్సీ వంటి సంస్థల షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్టోబర్ లో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ను ప్రకటించారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నోటిఫికేషన్లను మినహాయించి పగడ్బందీగా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు 


గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగాల నియామక విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. నిరుద్యోగులు ఆ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వారిని సంతృప్తి పరిచేలా హామీలను ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. లీకేజీలు, పరీక్షల నిర్వహణ లోపాల వల్ల అనేక పరీక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కారు నిరుద్యోగుల్లో నెలకొన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేరకు టీజీపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి కొత్త పాలక మండలి నియమించింది. పరీక్షల నిర్వహణను యుపిఎస్సి తరహాలో చేపట్టేలా కట్టుదిట్టమైన విధానాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యుపిఎస్సి చైర్మన్ తోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ పరీక్షలపై కోర్టు వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ ను ఉపసంహరించుకుంది. పకడ్బందీగా గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇటీవల ప్రాథమిక కీ విడుదల కాగా, త్వరలో ఫలితాలు వెలువాడనున్నాయి. ఉద్యోగాలు నియామకాల విషయంలో గతంలో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో కోర్టులు పలు తీర్పులను ఇచ్చాయి. ఆయా తీర్పులకు అనుగుణంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించింది. దీని ప్రకారమే టీజీపీఎస్సీ మెడికల్ బోర్డు, పోలీస్, గురుకుల బోర్డుల ద్వారా నిర్వహించిన పలు పోస్టులకు సంబంధించి అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ కూడా నియామకాల విషయంలో వేగాన్ని పెంచింది. గతంలో పెండింగ్ లో ఉన్న గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 1540 ఏఈ పోస్టులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎంపికైన జాబితా విడుదలైంది. హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టుల పరీక్షలు పూర్తవగా, డివిజనల్ అకౌంట్స్ అధికారి (డిఏఓ) పరీక్షలు గత నెల 30 న ప్రారంభయ్యాయి. టెట్ పూర్తి చేసి 11,062 పోస్టులతో డీఎస్సీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 


ప్రతిపక్షాల రాజకీయాలు చేస్తుండడం వల్లే 


నిరుద్యోగుల సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయానికి సరైన సమాధానం ఇచ్చే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ వీలైనంత వేగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగైదు రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు అన్ని విషయాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో విద్యార్థినేత మోతిలాల్ దీక్షపై ఆరా తీసిన ఆయన.. నిరుద్యోగుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించినట్లు సమాచారం. నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ విడుదల అంశాలపై పార్టీ విద్యార్థి, యువజన నాయకులతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.