Arikepudi Gandhi Vs Padi Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ అనుచరులు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటని అన్నారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందని అన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర - కేటీఆర్
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందని అన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.


అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసులు.. అరికెపూడి గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని కేటీఆర్ ప్రశ్నించారు. వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కా ముందస్తుగా ప్లాన్ చేసే ఈ దాడి చేశారని కేటీఆర్ అన్నారు. పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. 


కౌశిక్ రెడ్డికి భద్రత ఇవ్వాలి - హరీశ్ రావు
‘‘ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య.


పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.