Bandi Sanjay: ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడ్డ రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని చెప్పుకొచ్చారు. 


నయా నిజాం కేసీఆర్ కు మత పిచ్చి ఎక్కువైందని ధ్వజమెత్తారు. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేయడానికి కేసీఆర్ పూనుకున్నారని మండిపడ్డారు. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజంలో ఉన్న కుల వృత్తులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ది మత దురహంకారమని, బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి, ఎంఐఎం ను సంతృప్తి పరచాలన్నదే కేసీఆర్ లక్ష్యమని బండి సంజయ్ ఆరోపించారు.


ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీ కులవృత్తులపై దాడి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ వర్గాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు వేసినట్టుగా ఉందని అన్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారంపై పోరాడుదామని, కుల వృత్తులను కాపాడుకుందామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు.