తన బిడ్డ కల్వకుంట్ల కవితను బీజేపీలోకి లాగాలని చూస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘‘తన అధికారం కోసం... తన కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్.. చివరకు తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తుందని సిగ్గులేకుండా చెబుతున్నడు. అయినా కేసీఆర్ నే ఎవడూ దేఖడం లేదు.. ఇగ ఆయన బిడ్డను పట్టించుకునేదెవడు?’’ అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 


పార్టీలోకి లాగాలని చూసే పార్టీని చెప్పుతో కొట్టాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. ‘‘ ఇతర పార్టీల నుండి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నడు... మరి ఆయనను ఏ చెప్పుతో కొట్టాలో ఆలోచించండి...’’అని అన్నారు. ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతికుమార్ తో కలిసి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.


‘తన అధికారం కోసం... తన కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్.. చివరకు తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తుందని సిగ్గులేకుండా చెబుతున్నడు. కేసీఆర్ వస్తేనే... పట్టించుకోలేదు... ప్రజలను రాచి రంపాన పెడుతున్న కేసీఆర్ నే ఎవడూ దేఖడం లేదు. ఇగ ఆయన బిడ్డను పట్టించుకునేదెవరు? . ఎవరైనా అభివ్రుద్ధి కార్యక్రమాలు మాట్లాడతారేమోనని... సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం లేదు. ఎన్ని లంగా పనులైనా... రాజకీయాలైనా చసి గెలవాలనుకుంటున్నడు. ఎంతసేపటికి ఇతర పార్టీల నేతలను గుంజాలే... ఇతర పార్టీలపై బురద చల్లాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నడు’ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఎం కేసీఆర్‌ను ఏ చెప్పుతో కొట్టాలంటూ ఫైర్
‘నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రావడం లేదో.. గంప కింద ఎందుకు కమ్మి పెట్టిండో అర్ధం కావడం లేదు. సీఎంకు దమ్ముంటే దక్కన్ కిచెన్ హోటల్, ఫాంహౌజ్, ప్రగతి భవన్ లోని సీసీ పుటేజీలను సేకరించి విచారణ జరపాలి. మేం హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరినం. మా పిటిషన్ ను స్వీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ మారాలనే వాళ్లను చెప్పుతో కొట్టాలన్నడు... 37 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నడు.. మరి ఆయనను ఏ చెప్పుతో కొట్టాలె? బీజేపీకి వచ్చే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి. భేషరతుగా.. అదే మా సిద్దాంతం? మరి మీ సంగతేంది? ముందస్తు ఎన్నికల్లేవనే దానిపై.... కేసీఆర్ ఏది చెప్పినా... అది ఉల్టా జరుగుతుంది. జరగవని అన్నడంటే.. కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతాడని అర్ధం. మేం దేనికైనా సిద్దంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెడీ. బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్యం. అందుకే గెలుపు కోసం అడ్డదారులైనా తొక్కాలని కేసీఆర్ తన ఎమ్మెల్యేలను నిర్దేశిస్తున్నడు.


ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది కేసీఆర్..
‘ఫోన్ ట్యాపింగ్ చేస్తోందే కేసీఆర్.. ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్ చేస్తోంది ఆయనే. ఇజ్రాయిల్ టెక్నాలజీని వాడుతున్నది ఆయనే. నాకు జైళ్లు కొత్త కాదు.. కేసులు కొత్త కాదు.. కొప్పుల ఈశ్వర్ కు కొంచెమైనా ఉండాలే... ప్రెస్ మీట్ లో కూర్చోనీయకుండా పక్కకు తోసిన కేసీఆర్ ను పొగుడుతున్నడు. ప్రధానిని కలవాలంటే ఎందుకు ముఖం చాటేస్తున్నడు? ఎందుకంత భయం? రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తలేదనుకుంటే.. మీటింగ్ కు వచ్చి ఎందుకు అడగలేదు. అసలు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంది. ప్రజలకు ఎందుకు వివరణ ఇవ్వడం లేదు. నిన్నటి సమావేశ ఉద్దేశమేంది? ఆ సమావేశంలో ఉద్దరించిందేమిటి. ఆ సమావేశంలో కేసీఆర్ భయపడుతున్నడు... మమ్మల్ని భయపెడుతున్నారని ఎమ్మెల్యేలే నవ్వుకుంటున్నరు’ అని ఎద్దేవా చేశారు బండి సంజయ్.


తెలంగాణలోనే కేసీఆర్ కు దిక్కు దివాణ లేదు. మునుగోడులోనే 100 మంది ఎమ్మెల్యేలను మోహరించిండు.. ఇగ దేశం అంతా ఎట్లా పోటీ చేస్తడు...టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నియామకాల్లేవు. బూత్ కమిటీల్లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బుద్ది లేదు.. కేసీఆర్ కు ఆలోచనే లేదు. ధరణి సమస్యలతో జనం అల్లాడుతుంటే ప్రశ్నించే దమ్ములేని నాయకులు. ఎందుకు ప్రశ్నించడం లేదు? కష్టపడి గెలిపించిన ప్రజలకు రేపు ఏం సమాధానం చెబుతరు? గొర్రెల్లెక్క తలూపుకుంటూ వస్తారా? అని జనం నిలదీసే రోజులు వస్తున్నయ్. యాడ చూసినా భూకబ్జాలే.. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు అన్నారు.


బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
- బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరబోతున్నారనే ప్రచారంపై... ఇదంతా కేసీఆర్ డ్రామా. ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నరు. రైతులు వడ్ల కొనేనాథుడు లేక గోస పడుతున్నరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు చనిపోతున్నరు. గొల్ల కురమలకు బ్యాంకులో వేసిన నిధులు ఫ్రీజ్ చేసిండు.. వాటిని రిలీజ్ చేయాలని ఆందోళన చేస్తున్నరు. వీటిని డైవర్ట్ చేసేందుకు ఆడుతున్న డ్రామాలివి. 
- మునుగోడులో... ఎవరు ఎంత డబ్బు పంచారు? ఏ పార్టీ మందు ఏరులై పారించింది? డీజేలు పెట్టి డ్యాన్సులేశారు? ఏ మంత్రి చిందులేశాడో... అక్కడి ప్రజలకు బాగా తెలుసు.
- విక్రుత, ఉన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్... ఆయన ద్రుష్టిలో ఉన్మాదం అంటే ఏమిటో... మేం కేసీఆర్ నీచ రాజకీయాలను, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ దేనికైనా సిద్ధమే.
- మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిక అంశం... నాకు తెలియదు..  వాళ్లు సొంత పనిమీద పోతే..దానికి పార్టీకి లింక్ పెడుతూ రాస్తున్నరు. వాళ్లకు, మీకు(మీడియా) సమన్వయం లేదేమో... బీజేపీ ఎవరో రావాలి.. ఎవరినో చేర్చుకోవాలని అనుకోవడం లేదు. కార్యకర్తలే మా బలం.
- నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల అడ్డా అని చెప్పుకుంటరు కదా... ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా కేసీఆర్ తన గంప కింద కమ్మేస్తే.. నిలదీయాల్సింది పోయి సిగ్గు లేకుండా ఆయన సంకలో చేరారు. 
- ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ దే. వందల కోట్లు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడు. అందుకు మునుగోడే నిదర్శనం.
- చివరకు బ్యూరోక్రసీని కూడా దిగజార్చిండు.. సీట్ల కోసం, పోస్టింగుల కోసం బ్యూరోక్రసీ సీఎం కాళ్లు మొక్కుతున్నరు. ఇయాళ హెల్త్ డైరెక్టర్ సీఎం కాళ్లను పదేపదే మొక్కడం చూస్తున్నాం కదా.. బహుశా మొక్కుడు స్కీం పెట్టిండేమో..
- టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనం. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి మద్దతివ్వడం ఎంతైనా అవసరం. కోవర్టు రాజకీయాలు చేసే నాయకులను గల్లా పట్టి గుంజి బజారున నిలబెట్టాలి. ఏ పార్టీ అయినా సరే... కన్నతల్లి లాంటి పార్టీని ఎవరు మోసం చేసినా నిలదీయాల్సిందే. 
- బీజేపీ సింహం. సింగిల్ గా పోటీ చేస్తుంది. జనసేనతోసహా మరే పార్టీతో పొత్తు పెట్టుకోబోం. ఒంటరిగా పోటీ చేస్తాం. హంగ్ రాదు... పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం... అమ్ముడుపోయే నాయకులున్న పార్టీల్లోని కార్యకర్తలంతా బీజేపీలోకి రావాలని కోరుతున్నాం. కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు అమ్ముడుపోయేటోళ్లు. 
- ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా కేసీఆర్ కు?
- సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిందెవరు? 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రైవేటీకరణ ఎట్లా సాధ్యం? ఇన్నాళ్లు పచ్చి అబద్దాలతో మోసం చేసిన టీఆర్ఎస్ నేతలు ప్రధాని వాస్తవాలు చెప్పడంతో తలదించుకుని తిరుగుతున్నరు.
- రామగుండం ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదు.. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎందుకు ఆహ్వానం పంపలేదో.. నిజంగా పంపారో లేదో తేలుతుంది.
- బీజేపీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులు చాలా మంది ఉన్నరు. ఎవరు బెటరో పార్టీ ఆలోచిస్తుంది. సంస్థాగతంగా బలోపేతంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రడీగా ఉన్నం. టీఆర్ఎస్ కు బూత్ కమిటీల్లేవు. మండల, జిల్లా కమిటీల్లేవు. 
- బీజేపీ అందరి నాయకులను గౌరవిస్తుంది. ఇంట్లో కూర్చున్న స్వామిగౌడ్ లాంటి వాళ్లకు గౌరవ స్థానం కల్పించాం. ఆ సంస్కారం మాకుంది. వాళ్లు ఏం ఆశించి వెళ్లారో వాళ్ల విజ్ఝతకే వదిలేస్తున్నాం. 
- నిర్మల్ జిల్లా నాయకుడు రామారావు పటేల్ మంచి నాయకుడు. హిందుత్వ వాది. బైంసా అల్లర్లలో బాధితుల పక్షాన నిలిచారు. ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం.
- మునుగోడు గెలుపోటములతో బీజేపీ కుంగిపోలేదు. మరింత ఉత్సాహంతో, పట్టుదలతో పాదయాత్ర-5 ప్రారంభించబోతున్నాం. ఈసారి ముథోల్ నియోజకవర్గంలోని బాసర నుండి ఈనెలాఖరులోగా పాదయాత్ర చేయాలని భావిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది.  ప్రజలు తమ పక్షాన ఎవరు పోరాడుతున్నారో గమనిస్తున్నారు. ఎవరు అండగా ఉంటారో చూస్తున్నారు. 
- సూపర్ స్టార్ క్రిష్ణతో నాకు అనుబంధం ఉంది. నాకు గతంలో ఫోన్ చేసి తన పార్లమెంట్ అనుభవాలను నాతో పంచుకున్నారు.