Revanth Reddy US Tour: గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చిన్నచిన్న మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమేగాక...వారికి శిక్షణ చేయూతనిస్తున్న  వీ హబ్‌(WE HUB)కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.తెలంగాణ(Telangana)కు పెట్టుబడుల సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) బృందం సమక్షంలో వీ హబ్‌లో పెట్టుబడులకు ఓ భారీ ఒప్పందం జరిగింది.


ఫలిస్తున్న తెలంగాణ సీఎం అమెరికా పర్యటన
తెలంగాణ(Telangana) ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy)...భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు.వివిధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ప్రవాసీయులతోనూ ఆయన సమావేశమయ్యారు. అమెరికా(America) సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి మాతృభూమి రుణం తీర్చుకోవాల్సిందిగా కోరారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.


వీ హబ్ లో భారీ పెట్టుబడులు
మహిళా సాధికారతే లక్ష్యంగా, అతివలను ఆర్థికంగా తీర్చిదిద్దడమే గమ్యంగా సాగుతున్న తెలంగాణ వీహబ్‌(WeHub)లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.రూ. 42 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు  వాల్స్ కర్రా హోల్డింగ్స్ గ్రూప్  ఒప్పందం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో స్టార్టప్‌(Startup)లలో మొత్తం రూ. 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందు కుదిరింది. ఇందులో భాగంగా వీహబ్‌లో ఈ సంస్థ రూ.42 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 


Also Read: స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా - కీలక ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి


మాతృభూమి రుణం తీర్చుకుంటా
వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ కంపెనీని గ్రెగ్‌వాల్ష్‌, ఫణికర్రా నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఫణికర్రా..ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థి. తెలంగాణలో చదివి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తనకు మళ్లీ మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఫణి అన్నారు. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న వీహబ్‌లో పెట్టుబడులు పెట్టదం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. తమ పెట్టుబడులు వీహబ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వాల్స్‌ కర్రా హోల్డింగ్స్‌ సంస్థ అమెరికా, సింగపూర్‌లో విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో గ్రెస్‌వాల్ష్‌, ఫణి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లు, స్థిర లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతిచ్చి పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ కంపెనీ ప్రతినిధులు, వీహబ్‌ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందం చేసుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధితో సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వీహబ్‌లో పెట్టుబడులు పెట్టినందుకు సంస్థ ప్రతినిధులను అభినందించారు.


అమెరికాలో అత్యున్నత సంస్థల్లో తెలుగువారు కీలక స్థానాల్లో పనిచేస్తున్నారని...వారంతా మాతృభూమిలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. పుట్టినభూమి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని...ఆయన సూచించారు. సొంతఊరికి సాయం చేస్తే వచ్చే ఆత్మ సంతృప్తి మరి ఎందులోనూ రాదన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల వల్ల ఆయా సంస్థలకూ ఎంతో లాభం చేకూరుతుందన్నారు. కాబట్టి ప్రవాసులంతా ఈ దిశగా ఆలోచించాలన్నారు. వీహబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఫణికర్రాను ఆయన అభినందించారు.


Also Ready: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, అమెరికాలో సీఎం రేవంత్ ఒప్పందం - 15000 మందికి ఉద్యోగాలు