Telangana: తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్విని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ సీనియర్ నేత కే కేశవరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో అలా ఖాళీ అయిన స్థానానికి ఈ మధ్యే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. 


తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత అభిషేఖ్ మను సింఘ్వీ రాజ్యసభకు వెళ్లనున్నారు. కేకే వదులుకున్న ఎంపీ సీటు నుంచి ఆయన్ని పెద్దల సభకు పంపిస్తున్నారు.  


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్‌ఎస్ రాజీనామా చేసి అధికార పార్టీలోకి చేరిపోయారు. అలానే అప్పటి వరకు బీఆర్‌ఎస్ ఎంపీగా, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా కేశవరావు పార్టీ మారారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


2020లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేకే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉంది. అయినా అనర్హత వేటు పడక ముందే తన పదవికి రాజీనామా చేశారు. ముందు కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 


ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత  కేశవరావు తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆయన అభ్యర్థనను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. ఆ స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్టు అందులో పేర్కొన్నారు. 


ఈ మధ్య దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పదికిపైగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వేసింది. అందులో తెలంగాణ నుంచి ఒక స్థానం ఖాళీ ఉన్నట్టు పేర్కొంది. ఆ ఒక్క స్థానం ఎలాగూ కాంగ్రెస్ నేతకు దక్కే అవకాశం ఉంది. అందుకని ఆ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న అభిషేఖ్ సింఘ్వీకి ఇస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఇప్పుడు మరోసారి ఆయన్ని కాంగ్రెస్ పెద్దలక సభకు పంపిస్తోంది.