14 Bridges on Musi River: హైదరాబాద్‌ నగరంలో జనాభా రోజురోుకూ పెరిగిపోతోంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్ర సర్కారు.. మూసీ నదిపై 14 వంతెనలు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అయితే టెండర్లు పూర్తి అయిన 7 వంతెనల నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. వీటితోపాటు దుర్గం చెరువులో మురుగు నీరు చేరకుండా నిర్మించిన 7 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని, దుర్గం చెరువులో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఆయన ప్రారంభిస్తారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేస్తారు. అలాగే నెక్లెస్ రోడ్డులో సుమారు 26 కోట్లతో పది ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కును ఈనెల 26వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించున్నారు. 


మొత్తం 7 వంతెనల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన


దుర్వాసన, చెత్తకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మూసీ నదిపై 55 కిలో మీటర్ల పొడవున ప్రవహించే మూసీ నదిపై పాత వంతెనలే వినియోగంలో ఉన్నాయి. ఈ వంతెనలు ట్రాఫిక్ భారాన్ని మోయలేకపోతున్నాయి. ఈక్రమంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి మూసీ, ఈసీ నదులపై 14 వంతెనలు నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్‌. మూసీపై 10, ఈసీపై నాలుగు... అంటే ఈ రెండు నదులపై మొత్తం 14 వంతెనలను నిర్మించబోతున్నారు. వీటిలో 14 వంతనెల్లో 13 హైలెవల్‌ వంతెనలు, ఒకటి పాదచారుల వంతెన. 14 వంతెనల్లో 5 బ్రిడ్జిలను హెచ్ఎండీఏ నిర్మిస్తుండగా, మిగతా 9 బ్రిడ్జిలను జీహెచ్‌ఎంసీ  నిర్మిస్తోంది. హెచ్‌ఎండీఏ నిర్మించబోతున్న 7 బ్రిడ్జిలకు సంబంధించి టెండర్లను ఈమధ్యనే పిలిచారు. ముసారాంబాగ్, ఫతుల్లాగూడ నుంచి పూర్దాజిగూడ వరకు, మంచిరేవుల, బుద్వేల్‌ ఐటీ పార్కు-1, బుద్వేల్‌ ఐటీ పార్కు-2,  పత్రాపసింగారం, ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ ప్రాంతాల్లో ఈ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్‌ చేశారు. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.


15 నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తి


ఉప్పల్ భగాయత్ లే అవుట్ వద్ద రూ.42 కోట్లతో, ప్రాతాప సింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లతో, మంచిరేవుల వద్ద రూ.39 కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-2 సమీపంలో ఈసీపై రూ.32 కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-1 సమీపంలో ఈసీ నదిపై రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ వంతెన నిర్మాణాలు చేపడుతోంది. అలాగే మూసారాంబాగ్ వద్ద జీహెచ్ఎంసీ, ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు మూసీ నదిపై హెచ్ఆర్డీసీఎల్ నిర్మాణ పనులు చేపట్టనుంది. కాగా ఉప్పల్ భగాయత్, ప్రతాప సింగారం ప్రాంతాల్లో సుమారు 20 మీటర్ల పొడవును మూసీపై నాలుగు వరసల వంతెన నిర్మాణం ప్రత్యేకంగా నిలవబోతుంది. అయితే 15 నెలల్లోనే ఈ నిర్మామ పనులను పూర్తి చేయబోతున్నారట. 


మరోవైపు ఈసీ నదిపై బుద్వేల్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోనే రెండు బ్రిడ్జిలను హెచ్‌ఎండీఏ నిర్మించనుంది. ఇక, గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌  వెళ్లే ఔటర్‌ రింగు రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం ఐటీ కంపెనీలకు అనువుగా ఉండటంతో ఇక్కడ మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ  వీటిని నిర్మించనున్నారు. బుద్వేల్‌ ఐటీ పార్కుతో రాజేంద్రనగర్‌ రేడియల్‌ రోడ్డును అనుసంధానం చేసే విధంగా ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.  అదేవిధంగా బండ్లజాగీర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఖలీజ్‌ఖాన్‌ దర్గా, కిస్మత్‌పూర్‌ ప్రాంతాలను కలుపుతూ పలు అనుసంధాన రోడ్లను సైతం నిర్మించనున్నారు. బుద్వేల్‌ ఐటీ  పార్కుకు సమీపంలోనే భవిష్యత్తులో ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ మార్గం ఏర్పాటు చేయనుండటంతో కొత్తగా పలు రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు.