Mlc Kavitha On Bilkis Bano Case : గుజరాత్ లో బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యాచార దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మహిళ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీజేఐకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను లేఖలో కోరారు. 2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు.  సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం నిందితుల రేమిషన్ కి అనర్హత విధించవచ్చని కవిత అభిప్రాయపడ్డారు. అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన దోషులను స్వాతంత్ర్య దినోత్సవం నాడు బయటికి విడుదల చేయడం సరికాదన్నారు.  


11 మంది దోషులు విడుదల 


ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ నిందితులు నేరానికి పాల్పడినట్లు నిరూపించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులకు శిక్ష విధించిందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభత్వాన్ని సంప్రదించాలని  సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని కవిత ప్రస్తావించారు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదన్నారు.  


దోషులకు పూలదండలతో స్వాగతం 


క్రిమినల్ అప్పీల్ నెంబరు 490-491/2011 కేసులో 2012 నవంబరు 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 1992 నాటి విధానం స్థానంలో 2014లో సవరించిన రిమిషన్ విధానం తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వాలు రిమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించొద్దని, వాస్తవిక దృష్టితో రిమిషన్ అధికారాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసిందన్నారు. 11 మంది దోషులను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంలో తగిన వాస్తవిక దృష్టిని పరిగణలోకి తీసుకున్నారో లేదో స్పష్టత లేదని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు కాగా ఆమె ఐదు నెలల గర్భిణీ అని గుర్తుచేశారు. రేపిస్టులు బయటకు రావడాన్ని చూసి, వారికి పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముక్కలయ్యి ఉంటుందని కవిత లేఖలో రాశారు. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టి చట్టాలపై విశ్వాసాన్ని కాపాడాలని సీజేఐను ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. 






Also Read : KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్


Also Read : Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన