Himanshu Heads CAsnival : ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీమ్ తో నిర్వహించిన కాస్నివాల్ కు  ఇంఛార్జ్ గా హిమాన్షు వ్యవహిరించారు. ఈవెంట్ లో భాగంగా ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్ తో  విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు.  ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కాస్నివాల్ కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.  కాస్నివాల్ లోని స్టాల్స్ ను మంత్రి  పరిశీలించారు. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి...  నేటితరం పిల్లల ఆలోచన విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్స్ లోనూ పలు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 


నేటి తరం ఆలోచనలు అందుకోవడం కష్టం- మంత్రి సబితా ఇంద్రారెడ్డి


ఈ కాలం పిల్లల ఆలోచనలు అందుకోవడం తమ లాంటి వాళ్లకు ఎంతో కష్టమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము రాష్ట్రాన్ని చదివితే ఈ పిల్లలు ప్రపంచాన్నే చదువుతున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్ లో మురికి కూపాలుగా మారిన చెరువులను పునరుద్దరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన స్నేహితులతో కలిసి పనిచేయడం సంతోషకరం అన్నారు. ఈ తరం పిల్లలు చదువుతో పాటు సామాజిక ఆలోచనలు  మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఇలాంటి యువతే దేశానికి, రాష్ట్రానికి అవసరం అన్నారు. కొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని చెప్పారు. మంత్రి కేటీఆర్  నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన టీహబ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. కార్నివాల్ తో వచ్చే డబ్బులను నానక్ రాం గూడ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ కోసం ఇవ్వడం మంచి ఆలోచన అన్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ పిల్లలు భవిష్యత్తులో రోల్ మోడల్ గా నిలుస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 


 పక్కవాళ్లకు సాయం చేయడమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది-హిమాన్షు 


ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ ప్రెసిడెంట్ గా ఈ కాస్నివాల్ ను నిర్వహించిన హిమాన్షు మాట్లాడుతూ... తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. తాను చదువుతో పాటు  సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వులో పొందుతానన్నారు. కాస్నివాల్ తో వచ్చే డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువును పునరుద్దరిస్తామన్నారు. ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానన్నారు. తమ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చెరువులను ఎలా పరిరక్షించాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారిని పర్యావరణ వేత్తలుగా మార్చడమే తమ మిత్ర బృందం లక్ష్యమన్నారు.  గతంలో కంటే భిన్నంగా ఈసారి కాస్నివాల్ ను నిర్వహించామన్న హిమాన్షు. స్టాల్స్ నిర్వహణతో విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉందన్నారు. ఓక్రిడ్జ్ లో ఎంతో ఘనంగా నిర్వహించిన కాస్నివాల్ ఈవెంట్ లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు.