Congress Geeta Reddy : తెలంగాణలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆమె... బాలిక అత్యాచారం కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతుందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలని కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసిన మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పబ్స్ కి, డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందని ఆరోపించారు. అసలు పబ్స్ కి పరిమిషన్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు. 2014లో మద్యంతో రూ.10 వేల కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 34 వేల కోట్ల అదాయం వస్తుందన్నారు. మైనర్ రేప్ కేసు విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్స్ బోర్డు ఛైర్మన్ కొడుకు ఉన్నారని ఆరోపించారు. నిందుతుడు దుబాయ్ ఎలా వెళ్లాడని ఆమె ప్రశ్నించారు. 


రఘునందర్ రావుపై చర్యలు తీసుకోవాలి


బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాపాడాలని చూస్తున్నారు. అమ్మాయి వీడియో రిలీజ్ చేసి అమ్మాయి కుటుంబం బయట తిరగకుండా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటయ్యాయి. ఒక న్యాయవాదిగా పని చేసే రఘునందనరావుకు ఆడ బిడ్డలు లేరా? ఆయనపై కూడా కేసుపెట్టాలి. ఉడ్తా తెలంగాణగా చేశారు. న్యాయవాది వామనరావు దంతులని రోడ్ పై నరికి చంపేస్తే చర్యలు లేవు. మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. పోలీస్ లు హౌస్ అరెస్ట్ లు చేయడానికే పనికొస్తారు. నిందితులని పట్టుకోవడానికి పనిచేయరు. ఎంఐఎం నాయకులతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుకు పరిచయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే రఘునందన్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 


బీజేపీ ఆఫీస్ ముట్టడి 


ఆమ్నేషియా పబ్ బాధితురాలి వీడియోలు, చిత్రాలను బహిర్గతం చేసి బాధిత కుటుంబాన్ని మనోవేదనకు గురిచేసిన విధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ(NSUI) రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అత్యాచారం కేసులో బాధితురాలి వీడియోలు, చిత్రాలను బహిర్గతం చెయ్యకూడదనే కనీస జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా ముందు వాటిని బహిర్గతం చెయ్యడం సిగ్గుచేటన్నారు. బాధితురాలి కుటుంబ పరువుకు భంగం కలిగించిన రఘునందన్ రావుపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.