Bandi Sanjay : సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే సీఎం కేసీఆర్ సహా కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్నా ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేదో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం మెప్పుకోసం తెలంగాణ విమోచన చరిత్రనే వక్రీకరిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన తరుణంలో  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  


కేంద్రం నిర్ణయంతో దిగొచ్చిన కేసీఆర్ 
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో సీఎం కేసీఆర్ అనేకసార్లు మాట మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం రోశయ్యను తిట్టిన కేసీఆర్... తెలంగాణ వచ్చాక మాట మార్చారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక విమోచన దినోత్సవాలెందుకు అని కేసీఆరే అన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయించగానే దిగొచ్చి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 


దారుస్సలాం ఆదేశాలతోనే 


"దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల జపం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే జపం చేస్తోంది. అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమయ్యాయి. అందుకే కాళోజీ గుర్తుకొస్తున్నారు. స్థానికేతరుడు తప్పు చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలి. మనోడు తప్పు చేస్తే ఇక్కడే పాతిపెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడెండుకు మాట మార్చి దారుస్సలాం చెప్పిన మాటను అమలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలని చెబుతున్న కేసీఆర్ కు ఆనాడు సర్దార్ పటేల్ ’ఆపరేషన్ పోలో’ ఎందుకు నిర్వహించారో తెలియదా?"- బండి సంజయ్ 


ఆపరేషన్ పోలో అందుకే 


నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ చేతులు నరికిన వ్యక్తి నిజాం అని బండి సంజయ్ అన్నారు. దాని గురించి అసదుద్దీన్ ఓవైసీ ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆడిస్తే ఏనాడైనా స్పందించారా? అని నిలదీశారు. బైరాన్ పల్లి, నిర్మల్, పరకాల దురాగతాల గురించి నోరు విప్పరా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని ఆరోపించారు. రజకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పార్టీ ఆదేశాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పాటిస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఒవైసీ చేతిలో కీలుబొమ్మలా మారాయో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ఆనాడు తెలంగాణ ప్రజలు పడుతున్న వెట్టి చాకిరి నుంచి, బానిస బతుకుల నుంచి విమోచనం కలిగించడానికే ఆపరేషన్ పోలో నిర్వహించారన్నారు. 


Also Read : TS Cabinet Decisions : సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!


Also Read : Nirmala Sitharaman : హైదరాబాద్ పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా?, రాజీనామా ఎవరు చేయాలో ప్రజలే డిసైడ్ చేస్తారు - నిర్మలా సీతారామన్