TS Cabinet Decisions : సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 16,17,18 మూడురోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు నిర్వహించున్నారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

  


మూడు రోజుల పాటు కార్యక్రమాలు 


సెప్టెంబర్ 16 వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగించనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
 సెప్టెంబర్ 17  మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం, నక్లెస్ రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుందని కేబినెట్ తెలిపింది. అనంతరం అక్కడే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయనున్నారు. కవులు కళాకారులను గుర్తించి సత్కరిస్తారు. తెలంగాణ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 






పోడు భూములపై 


పోడు భూములపై కేబినెట్ లో చర్చ జరిగింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవెన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు, మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.


దళిత బంధు  


రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం అందచేస్తున్న 100 మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.


కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు 


 జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 వరకు, ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు  కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని కేబినెట్ తీర్మానించింది.సుంకిశాల నుంచి హైదరాబాద్ కు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది.  అందుకు రూ. 2214.79 కోట్లను  మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకై 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని తీర్మానించింది. భధ్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.


Also Read : Nirmala Sitharaman : హైదరాబాద్ పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా?, రాజీనామా ఎవరు చేయాలో ప్రజలే డిసైడ్ చేస్తారు - నిర్మలా సీతారామన్