హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసినా పొలిటికల్ హీట్ తగ్గలేదు. శనివారం పోలింగ్ ముగిసిన తర్వాత వీవీ ప్యాట్లను ఓ ప్రైవేట్ వాహనంలో తరలించారని వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ (సీఈవో)కి ఫిర్యాదు చేసింది. వీవీ ప్యాట్ల విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్‌ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీచేసింది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈవో సోమవారం సమావేశం కానున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 ప్రక్రియపై ఈ సమావేశం జరగనుంది. 






Also Read: హుజూరాబాద్ లో బీజేపీ భారీ విజయం సాధించబోతుంది : బండి సంజయ్


సీబీఐతో విచారణ జరపాలి : బీజేపీ


అంతకు ముందు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ని బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచందర్ రావు కలిశారు. హుజూరాబాద్ పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి తరలించారని ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి జరిగిన వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. హుజురాబాద్ పోలింగ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఈవో శశాంక్‌ గోయల్‌‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సీబీఐ విచారణతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈసీని కోరారు. 


Also Read: ఎమ్మెల్యేలే డబ్బులు పంచారు, ఇప్పుడు ఈవీఎంలూ మార్చారు, టీఆర్ఎస్ ఓటమి ఖాయం: ఈటల


సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దు : ఆర్వో   


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వీవీ ప్యాట్‌ తరలింపు చర్చనీయాంశం అయ్యింది. హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) రవీందర్‌రెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఓ ప్రకటనలో వెల్లడించారు. పనిచేయని వీవీప్యాట్‌ను అధికారిక వాహనాల్లో తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో అన్నారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్‌ పనిచేయలేదని దాని స్థానంలో మరో వీవీప్యాట్ తో పోలింగ్ నిర్వహించామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని నవంబర్‌ 2వ తేదీ జరిగే లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో తెలిపారు. 


Also Read: రాత్రికి రాత్రే తరలిస్తారా? అన్నీ అనుమానాలే! నిరసనలకు బండి సంజయ్ పిలుపు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి