సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని సూచించారు. మహిళను ఈడీ ఆఫీస్ కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగులో ఉందని లేఖలో గుర్తు చేశారు. చట్టసభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు.. చట్టవిరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి, అన్ని అవకాశాలను వాడుకుంటానని లేఖలో పేర్కొన్నారు. తన ప్రతినిధి సోమ భరత్ ద్వారా బ్యాంక్ స్టేట్మెంటుతో సహా ఈడీ అడిగిన పత్రాలు పంపుతున్నానని లేఖలో వివరించారు.


మహిళా నాయకురాలిగా, పౌరురాలిగా, మహిళల హక్కులకు సంబంధించినంత వరకు చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవడం తన బాధ్యత అన్నారు ఎమ్మల్సీ కవిత. ఒక చట్టసభకర్త అయినందున, చట్టబద్ధమైన పాలన సాగేలా... ఏ ఏజెన్సీ ద్వారా ఎటువంటి ఉల్లంఘన జరగకుండా చూసుకోవడం తనబాధ్యత అని లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని PMLA చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు CRPC సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని ఆమె లేఖలో వివరించారు.


ఎమ్మెల్సీ కవిత తరపున ఈడీ ముందుకు హాజరయ్యామని సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై కేంద్రం కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టిందన్నారు. కవితను ఆధారాల్లేకుండానే అక్రమ కేసులు పెట్టి, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్పీసీ ప్రకారం మహిళలను ఇంటిదగ్గరే విచారించాలని భరత్ తెలిపారు. సాయంత్రం 6 గంటల లోపు విచారించాలన్న నిబంధనలున్నాయని గుర్తు చేశారు. మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఈడీ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. రాత్రి ఎనిమిదిన్నర వరకు కవితను విచారించి నిబంధనలను ధిక్కరించారని భరత్ అన్నారు.


కవిత ఫోన్ ను అక్రమంగా సీజ్ చేశారని, చట్టప్రకారం విచారణ చేయాలని కవిత కోరుతున్నామన్నారు భరత్. అయినా ఈడీ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. చట్టాన్ని గౌరవించి ఈనెల 11న కవిత ఈడీ ముందు హాజరయ్యారని గుర్తుచేశారు. చట్టప్రకారం విచారణ ఉండాలని కోరుకుంటూ సుప్రీంలో రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి విచారణ చేయరాదన్నారు. కవిత తరపున ఓ రిప్రజెంటేషన్ ను ఈడీకి ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈడీ అడిగిన కొన్ని డాక్యుమెంట్లు అందజేశామని తెలిపారు. ఇది కచ్చితంగా తప్పుడు కేసు. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు అని ఆయన వాదించారు. ఏదైనా రాజకీయ క్షేత్రంలో ఎదుర్కుంటామని స్పష్టం చేశారు.


అనారోగ్యంతో విచారణకు హాజరవడం లేదని కవిత చెప్పిందనడం అవాస్తవం అన్నారు భరత్. CRPC యాక్ట్ ప్రకారం మహిళలకు కొనని హక్కులుంటాయని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కుల ప్రకారం మహిళలను, 16లోపు వారిని ఇంటిదగ్గరే ప్రశ్నించాలని అన్నారు. ఈడీ అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందజేశానన్నారు. ఈడీ అన్ని డాక్యమెంట్లను రిసీవ్ చేసుకుని అక్నాలెడ్జ్ చేసిందని, ఇది ఒక తప్పుడు కేసు, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని భరత్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మందుకు పోతామని స్పష్టం చేశారు.


ఈ క్రమంలో ఈడీ మళ్లీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 విచారణకు హాజరుకావాలని నోటీసులో సూచించింది! ఇంటిదగ్గరే విచారించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ఈనెల 24న విచారణ చేపట్టనున్న క్రమంలో ఈడీ ఇచ్చిన తదుపరి నోటీసులకు కవిత ఎలా స్పందిస్తారో చూడాలి! ఇదిలావుంటే, రామచంద్ర పిళ్లైకి 3 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతని కస్టడీని మార్చి 20 వరకు పొడిగించారు. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మార్చి 18 ఉదయం గం. 11.00కు విచారణకు రమ్మని ఈడీ పిలిచింది.