Chandrababu Pays Tribute To Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు (RamojiRao) చిత్రపటానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 'మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకం. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎవరికీ ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయం. మీడియా రంగంలో ఆయన ఓ శిఖరం. రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం.' అని పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






సీఎం రేవంత్ ఫోన్


అటు, రామోజీరావు కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 


లోకేశ్ సంతాపం


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం రామోజీరావు అస్తమయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు.' అని ట్వీట్ చేశారు.






Also Read: Ramoji Rao Passed Away:ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అస్తమయం