Turmeric Board: రాష్ట్ర రైతుల చిరకాల డిమాండ్ పసుపు బోర్డు. పసుపు బోర్డు కావాలని చాలా కాలం నుంచి నిజామాబాద్ రైతులు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ పసుపు బోర్డుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్ర సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 


అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర రైతుల్లో ఆనందం నింపాల్సింది పోయి.. అనుమానాలను రేకెత్తించింది. ఎందుకంటే ఈ గెజిట్ నోటిఫికేషన్ పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ నోటిఫికేషన్ లోనే ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు. పసుపు బోర్డు మండలి కూర్పు, దాని ఉద్దేశాలు, ఆర్థిక వనరులకు సంబంధించిన విధివిధానాలు, దాని నిర్వహణ, పర్యవేక్షణ వంటివన్నీ పేర్కొన్నారు. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది.. దానికేమైనా ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా.. అన్న వివరాలేవీ పేర్కొనలేదు. ఇందులో ఎక్కడా తెలంగాణ రాష్ట్రం పేరు లేదు.


ఇప్పటికే హైదరాబాద్ లో జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్) శాఖ ఉన్న విషయం తెలిసిందే.. దానికి బదులు గువహటిలోని నైపర్ డైరెక్టర్ ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటుందని తెలిపారు. పసుపు బోర్డుకు నిధులు కూడా కేంద్ర సర్కారే సమకూరుస్తుంది. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో సాగుతుంది. 


కేంద్ర విడుదల చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర రైతులకు మరోసారి నిరాశే మిగిలిందని.. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని బీజేపీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని తెలిసిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామంటూ తన పోస్టులో పేర్కొంది. 






పసుపు బోర్డులో ఎవరెవరు ఉంటారంటే..


ఛైర్‌పర్సన్, కార్యదర్శి, నలుగురు సభ్యులు (వ్యవసాయం- రైతు సంక్షేమం, ఆయుష్, ఔషధ మంత్రిశాఖలు- విభాగాలకు చెందిన నలుగురు సభ్యులు), పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధులు (రొటేషన్ పద్ధతిలో), ముగ్గురు పసుపు రైతులు, పసుపు ఆధారిత ఉత్పత్తుల ఎగుమతిదారుల నుంచి ఇద్దరు సభ్యులు, సుగంధద్రవ్యాల బోర్డు కార్యదర్శి, కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ డైరెక్టర్, గువాహటిలోని నైపర్ డైరెక్టర్, జాతీయ ఔషధ మొక్కల బోర్డు సీఈవో లు పసుపు బోర్డులో ఉంటారు. ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం మూడేళ్లు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ బోర్డు కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అన్ని సమావేశాలూ ఛైర్‌పర్సన్ నేతృత్వంలో జరుగుతాయి. ఛైర్‌పర్సన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో సీనియర్ వ్యక్తి నేతృత్వం వహిస్తారు.