కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల అయ్యారు. అంతకుముందు జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కేంద్రమంత్రి భగవంత్‌ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్​ బయటకు వచ్చారు. కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని బండి సంజయ్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది. వెంటనే విడుదల చేయాలని.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ విడుదల అవుతున్నారని తెలిసి.. కరీంనంగర్ జైలు వద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు వచ్చారు.


ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లాలనని బండి సంజయ్ అన్నారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేశారు. తాను కార్యాలయంలో దీక్ష చేస్తుంటే.. ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మళ్లీ జేలుకైనా వెళ్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. జీవో 317 సవరించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఉద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు.


ఇంకా బండి సంజయ్ ఏం మాట్లాడారంటే..


రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను జైలుకు పంపించినందుకు ఆనంద పడుతున్నారు.  బీజేపీ కార్యకర్తలకు, నాకు జైలు కొత్త కాదు. నేను జైలుకు పోవడం ఇది 9వ సారి. నేను చీటర్ ను కాదు... దొంగతనం చేసి జైలుకు పోలేదు. ఉఫాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకు వచ్చాను. కానీ 317 జీవోను మాత్రం సవరించాలని డిమాండ్ చేస్తున్న. లేనిపక్షంలో నీ సంగతి చూస్తాం. 


సీనియర్లకు, జూనియర్లకు కొట్లాట పెట్టకు. ఆ జీవోను సవరించు. విడో, దివ్యాంగులకు, స్పౌజ్ లకు అవకాశం కల్పించు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపి న్యాయం చెయ్. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలను పెట్టుకుని ఇలా చేయోద్దు. ఇక ధర్మయుద్ధం స్టార్ట్ అయ్యింది. కొందరు ఉద్యోగ సంఘ నాయకులతో ఇలా చేస్తున్నాడు. నిన్ను, నీకు కొమ్ముకాసే ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం వదిలిపెట్టను. 


జైలుకు పంపినని అనుకుంటున్నవేమో...నేను జైలుకు పోతే... తెలంగాణ సమాజం బాధపడింది. బయటకు రావాలని కోరింది. నేను ధర్మం కోసం, న్యాయం, నిరుద్యోగుల కోసం మళ్లీ జైలుకు పోవడానికి నాతోసహా ప్రతి బీజేపీ కార్యకర్త వస్తారు.  


నిన్ను గుంజుకుపోయి జైల్లో వేసే రోజు దగ్గర్లోనే ఉన్నయ్. వేల కోట్లు దోచుకుంటున్నవ్. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పే మాకు ఆధారం. ఈ కేసు తప్పని, మెట్టికాయలు వేసింది. నీ వ్యవహార శైలిని తప్పు పట్టింది.  అయినా బయటకు రాకుండా నాపై  ఒత్తిడి తెస్తున్నవ్.  నాకు నష్టమేమీ లేదు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మేం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సంగతి గుర్తు పెట్టుకో.


Also Read: Bandi Sanjay: హైకోర్టులో బండి సంజయ్ కి ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం


Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !