Breaking News Live: లిఫ్టులో ఇరుక్కుని యువకుడు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Dec 2021 08:48 PM
లిఫ్టులో ఇరుక్కుని యువకుడు మృతి

అనంతపురం నగరంలో ఓ యువకుడు లిఫ్ట్ లో ఇరుక్కుని మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం ఎనుములదొడ్డి ప్రాంతానికి చెందిన శాంత రాజు అనే 19 ఏళ్ల యువకుడు.. వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ.. వ్యవసాయం లేని సమయాల్లో కూలి పని కోసం అనంతపురం వచ్చేవాడు. నగరంలోని గుత్తి రోడ్డులోని కన్యకా పరమేశ్వరి నిలయం అపార్ట్మెంట్లో ఇవాళ ప్రమాదవశాత్తు లిఫ్టులో పైభాగం తలకు తగిలి తీవ్ర రక్తస్రవంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఇది గమనించిన యజమాని నాగ శరత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సినిమా టికెట్ల జీవోని సస్పెండ్ చేసిన హైకోర్టు

ఏపీ సినిమా టికెట్ల తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 35ను హైకోర్టు సస్పెండ్  చేసింది. ఏపీలో టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. 

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... వ్యద్ధాప్య పింఛన్లు రూ.2500కు పెంపు

వ్యద్ధాప్య పింఛనలపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  జనవరి 1 నుంచి వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వ్యద్ధాప్య పింఛన్లను రూ.2500కు పెంచారు. ఇప్పటి వరకూ రూ.2250 ఇచ్చేవారు.  

రోజా ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాక ఇండిగో ఫ్లైట్ గంట సమయం గాల్లోనే చక్కర్లు కొట్టింది. మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా రాజమండ్రిలో ఈ విమానం ఎక్కారు. విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినట్లు సమాచారం. వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్య తలెత్తిందా అనే విషయంలో స్పస్థత ఇవ్వడం లేదని యనమల తెలిపారు.


ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ఇండిగో సిబ్బంది ప్రయాణికుల నుంచి అదనపు రుసుము డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికుల మండిపడ్డారు. బెంగుళూరు నుంచి గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియామకం

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఆయన స్పీకర్‌గా సేవలు అందించారు.

కరీంనగర్ రెండు స్థానాలు టీఆర్ఎస్ సొంతం

కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు టీఆర్ఎస్  కైవసం అయ్యాయి. మొదటి ప్రాధాన్యతలోనే ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ దాటారు. టీఆర్ఎస్ అభ్యర్థి భాను ప్రసాద్ రావుకు - 584 ఓట్లు, ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణకు - 479 ఓట్లు,  ఇండిపెండెంట్ అయిన రవీందర్ సింగ్‌కు - 231 ఓట్లు, ఇన్ వాలిడ్- 17 ఓట్లు పడ్డాయి.

కేసీఆర్ వెంటే నల్గొండ జిల్లా: మంత్రి జగదీశ్ రెడ్డి

స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టి ఆర్ యస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసబ్యులకు, శాసన మండలి సబ్యులకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని ఆయన చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందని అన్నారు.

మెదక్‌లోనూ టీఆర్ఎస్ గెలుపు

మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డికి 299 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 96 ఓట్లు వచ్చాయి.

ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 228 ఓట్లు రాగా.. 211 ఓట్ల మెజారిటీతో తాతా మధు గెలుపొందారు.

నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ముందంజ

నల్గొండ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపు కోటా ఓట్లు సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1233 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

గచ్చిబౌలిలో భారీ చోరీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ దోపిడీ జరిగింది. ఆదాయ పన్ను అధికారులం అని నమ్మబలికి ఓ ఇంటికి వెళ్లిన దుండగులు భారీ మొత్తాన్ని దోచుకున్నారు. ఏకంగా మూడు కిలోల బంగారం, 2 లక్షల నగదును లూటీ చేసుకొని వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Background

తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నేటి ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపును సిబ్బంది మొదలుపెట్టారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సోమవారం సమీక్షించారు. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.


నేటి ఉదయం ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఎజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు  ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఆదిలాబాద్ లో 6 టేబుళ్లు, కరీంనగర్ 9 టేబుళ్లు, మిగతా చోట్లా 5 టేబుళ్లు ఏర్పాటుచేశామని శశాంక్ గోయల్ వెల్లడించారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ కడతారని.. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ (తొలి ప్రాధాన్యత) ఓట్లని లెక్కించి, తరువాత నెక్ట్స్ ప్రయారిటీ ఓట్లని లెక్కిస్తారని శశాంక్ గోయల్ తెలిపారు. కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. లాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 99.70 శాతం పోలింగ్ న‌మోదు కాగా, 1324 మంది ఓట‌ర్లకు గానూ 1320 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాలో 99.22 శాతం, ఉమ్మడి న‌ల్గొండ జిల్లాలో 97.01 శాతం, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో 96.09 శాతం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం ఓటింగ్ న‌మోదైంది.


ర్యాలీలకు అనుమతి లేదు.. 
కౌంటింగ్ కేంద్రాల్లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి కల్పించినట్లు సమాచారం. గుంపులు గుంపులుగా ఉండొద్దని, కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. నల్గొండ, మెదక్ లో కౌంటింగ్ రౌండ్స్ ఎక్కువ ఉన్నాయని శశాంక్ గోయల్ తెలిపారు. ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తరువాత విజేతలు ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓ ఇద్దరు మాత్రమే వచ్చి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లాలని సూచించారు.


క‌రీంన‌గ‌ర్‌లో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా టీఆర్ఎస్ నుంచి ఎల్ ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు బరిలోకి దిగగా.. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు.  ఖ‌మ్మంలో టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి బరిలోకి దిగారు. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, న‌గేశ్‌, ల‌క్ష్మయ్య, వెంక‌టేశ్వర్లు, కొర్ర రామ్‌సింగ్ పోటీ చేశారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి యాద‌వ‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మల‌, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మ‌ల్లారెడ్డి పోటీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠ‌ల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి మధ్య పోటీ నెలకొంది. ఫలితాలపై కొన్ని చోట్ల ఉత్కంఠ నెలకొంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.