ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు అమ్మకాలు ఆగటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాటి, ఈత చెట్లను వచ్చే కల్లును గతంలో కల్లు వ్యాపారులు అమ్మేవారు. కానీ రాను రాను బట్టిల్లో చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఆల్ఫాజోలోం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి రసాయనాలు కలిపి కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా కల్లు వ్యాపారులు వీటినే వాడుతూ కల్లును తయారు చేస్తూ విక్రయిస్తున్నారని అంటున్నారు.


తక్కువ ధరకు దొరుకుతుందని కూలీలు, హమాలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కల్లును తాగుతారు. అయితే చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు తయారు చేసి అమ్మటంతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నెల 18న బోధన్ మండలం సంగం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి జాతరలో కల్తీకల్లు సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రుల పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో305 కల్లు సోసైటీలు ఉన్నాయి. వీరు కల్లు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సరిపడా ఈత, తాటి చెట్లు లేవు. వాటి నుంచి వచ్చే కల్లు డిపోలకు పూర్తిస్తాయిలో సరిపోదు. దీంతో కొందరు నిషేధిత క్లోరో హైడ్రెట్, అల్పాజోలోం, డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం.


డిపోలపై నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు తయారీ జరుగుతోందన్న విషయం తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న వాదనా ఉంది. రసాయనాలు కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తూ విక్రయించటం వల్ల అమయాకుల ప్రాణాలకు ఇబ్బందిగా మారింది. మొన్న బోధన్ మండలం సంగం గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు ఊదాహరణగా చెప్పొచ్చు. కల్తీ కల్లు సేవించటం వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేయటం వల్ల ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక నైనా ఈ కల్తీ కల్లుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు జిల్లా వాసులు.


Also Read: AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !


Also Read: YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !