Full Rush in TSRTC Buses: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డులు తిరగరాస్తోంది. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు. ఇది ఒక రికార్డే అంటున్నారు ఆర్టీసీ అధికారులు.  ఇందుకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ కూడా ఒక కారణమని చెప్తున్నారు.


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక... ఇచ్చిన మాట ప్రకారం టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో... షేర్‌ ఆటోలు, క్యాబులు,  బైకులపై వారు కూడా... అవి వదిలేసి.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉచిత ప్రయాణం పథకాన్ని ఫుల్లోగా వాడేసుకుంటున్నారు. పైగా.. స్మార్ట్‌ కార్డు  ఇచ్చేవరకు పెద్దగా కండిషన్స్‌ ఏమీ పెట్టలేదు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు బస్సులో జీరో టికెట్‌ ఇస్తున్నారు. దీంతో మహిళలు పెద్దసంఖ్యలో బస్సుల్లో  ప్రయాణాలు చేస్తున్నారు. 


ఇక సోమవారం అత్యధిక సంఖ్యలో అర కోటి.. అంటే 50లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారని... తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆపరేషన్స్‌ ఈడీ  మునిశేఖర్‌ వివరించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడం కూడా... ఆ రోజు ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చని చెప్తున్నారు. ఆలయాలకు, ఇతర  ప్రాంతాలకు వెళ్లే వారు... ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా వినియోగించినట్టు చెప్తున్నారు. అయితే... ప్రయాణికుల రద్దీని ముందే ఊహించి.. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని  చెప్పారు అధికారులు. రెగ్యులర్‌ బస్సులతో పాటు స్పేర్‌ బస్సులను కూడా నడిపామన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.. వారాంతపు సెలవులు కూడా తీసుకోకుండా విధులు  నిర్వహించారని తెలిపారు. 


సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారని... 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక... దానికి  ముందు రోజు ఆదివారం సుమారు 41 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం 9లక్షల మంది ప్రయాణికులు పెరిగినట్టు తెలిపారు. ఉచిత  ప్రయాణం స్కీమ్‌ వల్ల రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.. దానికి తగ్గుట్టు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో మహిళలకు స్మార్ట్‌ కార్డులు  ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు.


ఇక... తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఏ బస్సు చూసినా ఫుల్‌ రష్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు  నిండిపోతున్నాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో... బస్సుల్లో రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పీక్స్‌ టైమ్‌లో.. నగరంలో మామూలుగానే నిల్చుడానికి  కూడా ప్లేస్‌ ఉండదు. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు ప్రయాణికులు. కీలక సమయాల్లో మరిన్ని బస్సులు పెడితే బాగుంటుందని చెప్తున్నారు  ప్రయాణికులు. లేకపోతే.. ఉచిత బస్సు ప్రయాణం సంగతేమో గానీ... గమ్యస్థానం చేరేలోపు నరకం కళ్ల ముందు కనిపిస్తుందని వాపోతున్నారు.