iPhone: టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను అసెంబుల్ చేసే విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసింది. ఇక నుంచి ఐఫోన్‌ను టాటా గ్రూప్ భారత్‌లో ఉత్పత్తి చేసి అసెంబుల్ చేయనుందని అక్టోబర్ 27న సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్/ట్విట్టర్ ద్వారా ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మరి ఈ డీల్ ద్వారా భారతదేశంలో ఐఫోన్ రేట్లు తగ్గుతాయో లేదో చూడాలంటే ప్రొడక్ట్ తయారయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే.


నివేదిక ప్రకారం విస్ట్రోన్ ఫ్యాక్టరీ విలువ సుమారు 125 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా టాటా గ్రూప్, విస్ట్రాన్ మధ్య ఈ డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయి. విస్ట్రాన్ ప్లాంట్ ఐఫోన్ 14 మోడల్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.


2008లో విస్ట్రాన్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ అనేక పరికరాలకు మరమ్మతు సౌకర్యాలను కూడా అందించింది. 2017లో కంపెనీ తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించింది. 


టాటా గ్రూప్ ఉప్పు అమ్మకం నుంచి సాంకేతిక సేవలను అందించడం వరకు అనేక రకాల వ్యాపారాలలో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ తయారీ, ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించడానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. టాటా గ్రూపు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని దాని ఫ్యాక్టరీలో ఐఫోన్ ఛాసిస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డివైస్ మెటల్ బాడీని తయారు చేస్తుంది. ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గతంలో చిప్‌మేకింగ్ వ్యాపారంలోకి రావాలని తమ కోరిక వెల్లడించారు.


ఐఫోన్ 15 సిరీస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. వీటి ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.  ఐఫోన్ 15 సిరీస్‌లో ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.


ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 15 మొబైల్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌‌ను ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అందించారు. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను  ఈ ఫోన్ అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.


ఈ రెండు ఫోన్లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను యాపిల్ అందించింది.


ఏ16 బయోనిక్ చిప్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మొబైల్స్ పని చేయనున్నాయి. గతేడాది ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఈ ప్రాసెసర్ అందించారు. యూఎస్‌బీ టైప్-సీతో లాంచ్ అయినమొదటి ఐఫోన్ సిరీస్ ఇదే. ర్యామ్, బ్యాటరీ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా ఈ ఫీచర్లు త్వరలో బయటపడే అవకాశం ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial