Cyber Warfare:భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ, డిజిటల్ డొమైన్‌లో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫేక్ ప్రచారంతో పబ్బం గడుపుకున్న పాకిస్థాన్ ఇప్పుడు వైరస్‌ వ్యాప్తికి సిద్ధమవుతోంది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్‌ మూలాలు ఉన్న హ్యాకర్సు సైబర్ దాడులు చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.  

Continues below advertisement


పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు ఈ సైబర్ దాడులను వాట్సాప్, ఇమెయిల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ప్రజలు ఎక్కువగా వాడే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేయనున్నారు.   'డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ' అనే మాల్వేర్‌ను భారత్‌లో స్ర్పెడ్ చేయాలను చూస్తున్నారు. డిజిటల్ వల్నెరబులిటీస్‌ను ఉపయోగించుకొని సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడమే ఈ దాడి ప్రధాన లక్ష్యం.  


భారతీయ పౌరులపై అధునాతన దాడి
సైన్యంతో నేరుగా వచ్చి పోరాటం చేయలేని పాకిస్థాన్ ఉగ్రవాదులను, సైబర్ నేరగాళ్లను, ఫేక్ ప్రచారకులను నమ్ముకుంటోంది. వీటితోనే దేశంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఇలా చేసి సాధారణ పౌరుల దృష్టి మళ్లించేందుకు విఫలయత్నం చేస్తోంది. వీడియో ఫైల్‌లు, డాక్యుమెంట్స్‌ ద్వారా 'డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ' వైరస్ వ్యాప్తి చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఫైల్‌లు ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఇంకా సీక్రెట్ ఫైల్స్ సహా ప్రైవేట్ డేటా హ్యాకర్లకు చేరిపోతుంది. అలా ఈ   'డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌ను డిజైన్ చేశారు.  


"లక్ష్యం స్పష్టంగా ఉంది: మాల్వేర్‌లను ఉపయోగించి వ్యక్తిగత, ఆర్థికపరమైన డేటాను చోరీ చేస్తారు" అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 


ఒకసారి ఈ మాల్ వైరస్ మీ డిజిటల్ డివైస్‌లోకి ఎంటర్ అయితే హ్యాకర్లే దాన్ని ఆపరేట్ చేస్తారు. కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటారు. కోలుకోలేని విధంగా నష్టాన్ని కలుగజేస్తారు. ఈ ఫైళ్లు తరచుగా ".exe" ఎక్స్‌టెన్షన్‌ల వంటి అనుమానాస్పద పేర్లు కలిగి ఉంటాయి, వాటిలో "tasksche.exe" కూడా ఉంది.


వైరస్ ఎలా వ్యాపిస్తుంది 
‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ వివిధ పద్ధతుల ద్వారా వ్యాపిస్తుంది. మానసికంగా మిమ్మల్ని ట్రిగర్ చేసే మోసపూరితంగా విధానాలతో హ్యాకర్లు ఈ వైరస్‌ను ఇన్‌స్టాల్ అయ్యేలా చేస్తారు. వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో మెసేజ్‌లకు అటాచ్ చేసిన ఫైల్స్ ద్వారా కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ వైరస్ వీడియో లేదా డాక్యుమెంట్‌ ఏ రూపంలోనైనా ఉంటుంది. నకిలీ ఉద్యోగ ఆఫర్ ఇమెయిల్‌లు, ప్రభుత్వ సమాచారం అంటూ వచ్చే ఫేక్ ప్రకటనల ద్వారా కూడా దీన్ని వ్యాప్తి చెస్తారు.  


మనుషుల్లో ఉన్న భయం, ఉత్సకత కలిగించే పోస్టులు పంపిస్తారు. ఎమర్జెన్సీ అనే భావాన్ని సృష్టిస్తారు. ఆకర్షణీయమైన బహుమతులు, ఆఫర్‌లు అంటు ప్రచార చేసి ఈ హానికరమైన లింక్‌లు ఓపెన్ చేసేలా బోల్తా కొట్టిస్తారు. ఇలా మిమ్మల్ని తప్పుదారి పట్టించే లింక్‌ల ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కూడా పోస్టు చేస్తారు.  


పెరిగిన నిఘా, సైబర్ భద్రతా చర్యలు
పెరుగుతున్న ముప్పుకు ప్రతిస్పందనగా, భారత అధికారులు దేశవ్యాప్తంగా హెచ్చరికను జారీ చేశారు. అసాధారణ డిజిటల్ చర్యలపై నిఘా పెట్టారు. ఏదైనా తేడాగా అనిపిస్తే సైబర్ భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ విభాగాలకు సూచించారు. సైబర్ భద్రతా నిపుణులు పౌరులు తమ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.


గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు పంపే లింక్‌లను ఓపెన్ చేయొద్దని సూచిస్తున్నారు. తెలియని సోర్స్ నుంచి వచ్చే అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయొద్దని కోరుతున్నారు, ఏదైనా అసంబద్ధంగా అనిపిస్తే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి పెట్టుకోవాలని హితవు పలికారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే అధికారులకు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. 


సేఫ్టీ చిట్కాలు
‘డ్యాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ మాల్వేర్ నుంచి సేఫ్‌గా ఉండటానికి నిపుణులు కొన్ని కీలకమైన సూచనలు చెబుతున్నారు. మొదట, తెలియని పంపేవారి నుంచి ఫైల్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దు. లింక్‌లను ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే వీటిలో హానికరమైన మాల్వేర్ ఉండవచ్చు. రెండో ఎమర్జెన్సీ అంటూ వచ్చే లేదా అవాస్తవ రివార్డులు అందించే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి ద్వారానే తరచుగా వైరస్‌లు వ్యాప్తికి ఎక్కువగా ప్రయత్నిస్తారు.  


డేటా భద్రత కోసం వినియోగదారులు తమ ముఖ్యమైన డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయాలి. ఇది దాడి జరిగినప్పుడు డేటా కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అన్ని ఆన్‌లైన్ ఖాతాలకు ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం మంచిది. రెండు ఫ్యాక్టర్ అంథెంటికేషన్ ఉంటే మరింత భద్రతంగా ఉంటుంది.