వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌ మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. అయితే దీన్ని కంపెనీ అధికారికంగా లాంచ్ చేయలేదు. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర
ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.14,590 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,979కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందా, లేకపోతే ఇలా లాంచ్ చేయకుండా విక్రయిస్తారా అన్నది తెలియరాలేదు.


వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 2డీ స్లిమ్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రాసెసర్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇది మీడియాటెక్ హీలియో జీ35 అయ్యే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది. గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ57 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?