China Phones: భారత్ నుంచి విదేశీ సంస్థలు క్రమంగా వెళ్లి పోతున్నాయి. దేశంలో తమ కార్యకలాపాలను ఇకపై కొనసాగించేది లేదని చెబుతున్నాయి. మార్కెట్‌లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఒకప్పుడు భారత్‌లోని చట్టాలని యథేచ్ఛగా ఉల్లంఘించినా.. ఏం అయ్యేది కాదు.. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పన్నులు కట్టకపోవడం, హవాలా తదితర అక్రమ కార్యకలాపాలు తగ్గడంతో దేశీయ మార్కెట్‌కు గుడ్‌బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన ఇతర దేశాల వైపు ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.


చైనాకు చెందిన అధికారిక మీడియాలో వెల్లడి..!


భారత్ నుంచి వైదొలిగిపోయే కంపెనీల జాబితాలో ఎక్కువగా చైనా కంపెనీలే ఉండటం గమనార్హం. అదీ ముఖ్యంగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలే ఎక్కువగా ఉంటున్నాయి. భారత్‌కు గుడ్ బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలలో ఆయా కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనాకు చెందిన అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది. 


ఈజిప్టులో ఒప్పో యూనిట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు..


కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా( భారత్ లో తయారీ)ని ప్రోత్సహిస్తోంది. దేశీయ కంపెనీలకు రాయితీలు, పన్ను మినహాయింపులు, ఇతర రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీని వల్ల ఆయా కంపెనీ తక్కువ ధరలోనే నాణ్యమైన ఉత్పత్తులు అందించగలుగుతున్నాయి. దీనిని చైనా కంపెనీలు తట్టుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు చైనా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది అంటూ భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్ లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఒప్పో ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఫోన్ ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మినియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని పేర్కొన్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కలప్న జరపనున్నట్లు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. 


ఆయా సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు..


2021వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - ఈడీ అధికారులు చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల ఉన్నత అధికారులను విచారించారు. ఆయా సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ యాక్ట్ ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.