ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో (ఎక్స్) మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకురానున్నాడు. ఇప్పటివరకు ప్రతి సోషల్ మీడియాలో ఉన్న ఫీచర్‌ను ట్విట్టర్‌లో తొలగించనున్నారు. ప్రతి సోషల్ మీడియాలో ‘బ్లాక్’ అనే ఫీచర్‌ను మనం చూస్తూనే ఉంటాం. మనకు నచ్చని వారిని, విసిగించే వారిని మనం బ్లాక్ చేయడం కామనే. ఇక ట్విట్టర్‌లో మీకు ఈ అవకాశం ఉండదు. మొత్తంగా ‘బ్లాక్’ ఫీచర్‌ను ఎలాన్ తొలగించనున్నారు.


కానీ పర్సనల్ మెసేజ్ చేయకుండా మాత్రం వారిని నిలువరించవచ్చు. ‘డీఎం (డైరెక్ట్ మెసేజ్)’ విషయంలో మాత్రం బ్లాక్ ఆప్షన్ అలాగే ఉండనుంది. కానీ టైమ్ లైన్, ప్రొఫైల్ విజిట్, మీరు చేసే పోస్టుల నుంచి మాత్రం యూజర్లను బ్లాక్ చేయలేరు.


నిజానికి బ్లాక్ అనేది సోషల్ మీడియాలో ప్రైవసీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. మనకు నచ్చని వారిని మన ప్రొఫైల్ చూడకుండా బ్లాక్ ఫీచర్ ఉపయోగపడుతుంది. కానీ దీని కారణంగా ఈ ఆప్షన్ కూడా దూరం కానుంది.


ఎక్స్‌లో కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు జరపడాన్ని కూడా ఇటీవలే ప్రారంభించారు. ఇందుకోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ అనే ప్రోగ్రామ్‌ను కంపెనీ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ స్వయంగా ట్వీట్ చేసింది.


ఎక్స్‌లో నేరుగా డబ్బు సంపాదించడంలో కంటెంట్ క్రియేటర్లకు సహాయపడే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఎంతో మంది క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయన్సర్లకు నగదు లభించింది.


ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎక్స్‌లో అర్హులైన క్రియేటర్‌లందరికీ (ఎక్స్ క్రియేటర్స్) యాప్‌లో, ఈ మెయిల్ ద్వారా మొదటి చెల్లింపుగా ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పటికే తెలియజేశారు. కొంతమంది ఎక్స్ క్రియేటర్స్ ఇప్పటికే దీన్ని వారి ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా వారి ఖాతాలలో నగదు ఎప్పటిలోపు జమ అవుతుందో కూడా కంపెనీ తెలిపింది.


మానిటైజేషన్ ద్వారా నగదు పొందాలంటే ఎక్స్‌లో మొదటగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొంది ఉండాలి. దీనికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గత మూడు నెలల్లో మీ పోస్టులపై ఐదు మిలియన్ల ఇంప్రెషన్లు సాధించాలి. గతంలో ఇది 15 మిలియన్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం దీన్ని తగ్గించారు. దీంతో పాటు క్రియేటర్ మానిటైజేషన్ స్టాండర్డ్స్ కోసం జరిపే హ్యూమన్ రివ్యూలో పాస్ అయి ఉండాలి.


మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఈ టెక్నాలజీతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐని బాగా వినియోగించుకుంటున్నాయి. ఈ మధ్యే సింగపూర్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఏఐ టెక్నాలజీని మరింత డెవలప్ చేసే పనిలో పడ్డారు. ఏకంగా మనిషి మెదడును కూడా రీడ్ చేసే సాంకేతికతను శాస్త్రవేత్తలు సృష్టించారు. దీని సాయంతో మనిషి తన మనసులో ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. 


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial