Cyber Crime: భారత్‌ లో సైబర్‌ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది దేశంలో 4,047 ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసం కేసులు, 2,160 ATM మోసం కేసులు, 1,194 క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసం కేసులు,  1,093 OTP మోసం కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదే విద్యుత్ బిల్లుల స్కామ్. చాలా తక్కువ మందికి ఈ స్కామ్ గురించి అవగాహన ఉంది.


అచ్చం విద్యుత్ శాఖ తరహాలోనే..


చాలా నెలలుగా ఈ స్కామ్ కొనసాగుతున్నా.. తాజాగా బయటకు వచ్చింది. “డియర్ కస్టమర్.. మీ విద్యుత్ కనెక్షన్ ఇవాళ రాత్ర వరకు తొలగించబడుతుంది. మీ బిల్లు అప్ డేట్ చేయబడలేదు. వెంటనే అప్ డేట్ చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి” అంటూ అచ్చం విద్యుత్ శాఖ పంపినట్లుగానే మెసేజ్ వస్తుంది. నిజమేనని నమ్మి ఆ లింక్ ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. సదరు నెంబర్ తో లింకై ఉన్న బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది.  


కొంతకాలం నుంచి ఇలాంటి మెసేజ్‌ల పట్ల వినియోగదారులు సైతం అలర్ట్ గానే ఉన్నారు. ఇలాంటి సందేశాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి మోసాలకు పాల్పడే కొంత మంది వ్యక్తులను సైబర్ క్రైమ్ అధికారులు అరెస్టు చేశారు. అయినా ఇలాంటి మోసాలు మున్ముందు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే మీ ఫోన్లకు వచ్చే టెక్ట్స్ మెసేజ్ లేదంటే వాట్సాప్ మెసేజ్ లలో లింకులను క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.   


ఆరితేరిన జమ్తారా గ్యాంగ్ 


సైబర్ క్రైమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జమ్తారా గ్యాంగ్ ఈ విద్యుత్ బిల్లుల మోసాలను ఎక్కువగా చేస్తుంది. ఇక్కడి సైబర్ నేరగాళ్లు ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి, వారి కరెంటు బిల్లు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని మెసేజ్ పంపారు. బాధితులు SMS లోని లింక్‌పై క్లిక్ చేస్తే, వారు తమ పెండింగ్‌ లో ఉన్న విద్యుత్ బిల్లును చెల్లించమని కోరిన టెలికాలర్ లేదంటే వెబ్‌ సైట్‌కు వెళ్తారు.  స్కామ్ గురించి తెలియని వ్యక్తులు తరచుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను చెప్తారు. వారు ఈ వివరాలు చెప్పిన వెంటనే డబ్బు నేరుగా ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది. చాలా సందర్భాలలో, ఈ టెలికాలర్లు  విద్యుత్ శాఖ అధికారుల మాదిరిగా నటించి బ్యాంక్ వివరాలను సేకరించారు. ఆ తర్వాత వారి అకౌంట్లలోని డబ్బులను కొల్లగొట్టారు.


ఢిల్లీలో 65 మంది అరెస్ట్ 


దేశ వ్యాప్తంగా విద్యుత్ బిల్లు స్కామ్‌పై వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదు అయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఈ విద్యుత్ బిల్లు పేరిట ప్రజలను మోసం చేసినందుకు ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ 65 మందిని అరెస్టు చేసింది. ఇటువంటి మోసాలలో ఎక్కువ భాగం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో పాటు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. మధ్యప్రదేశ్ లోని జమ్తారా గ్యాంగ్ ఇలాంటి నేరాల్లో ఆరితేరినట్లు పోలీసులు వెల్లడించారు. కనుక ఎవరికైనా కరెంట్ బిల్లు కట్టలేదని మెస్సేజ్ వస్తే కంగారు పడొద్దని, అలాంటి లింక్స్ క్లిక్ చేయకుండా మీరు రెగ్యూలర్ గా చేసే తరహాలో కరెంట్ బిల్లులు పే చేయాలని, కొత్త మార్గాల్లో ప్రయత్నించవద్దని సూచించారు.


Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?