Pakistani boxer steals money : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ (Pakistani)పరువు మరోసారి పోయింది. ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పరువు... విదేశాల్లో నడిరోడ్డుపాలైంది. పాక్‌ బాక్సర్ ఎలగబెట్టిన ఘన కార్యం చూసి... ఇదేం చోద్యం రా నాయనా అని అంతర్జాతీయ క్రీడా రంగం నివ్వెరపోయింది ఇంతకీ ఏం  జరిగిందంటే..?

 

సొమ్ము దొంగిలిస్తూ... 

విదేశాలకు వెళ్లిన పాకిస్థాన్‌ బాక్సర్‌ తోటి ఆటగాళ్ల బ్యాగ్‌లోని సొమ్మును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ అమెచ్యూర్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ స్వయంగా వెల్లడించింది. ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో పాల్గొనేందుకు  పాక్‌కు చెందిన ఐదుగురు బాక్సర్లు ఇటలీకి వెళ్లారు. వీరిలో జోహెబ్‌ రషీద్‌ (


Zohaib Rasheed) ఒకడు. ఆ జట్టు సభ్యురాలైన లౌరా ఇక్రామ్‌ శిక్షణ శిబిరానికి, కోచ్‌ అర్షాద్‌ హుస్సేన్‌ టోర్నీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. వాతావరణం చల్లగా ఉండటంతో తాను శిక్షణకు రాలేనని రషీద్‌ మాత్రం గదిలో ఉండిపోయాడు. సహచరులు వెళ్లిపోయాక ఫ్రంట్‌ డెస్క్‌ నుంచి తాళాలు తీసుకొని ఇక్రామ్‌ గదికి చేరుకొన్నాడు. పర్స్‌లోని విదేశీ కరెన్సీని తీసుకొని హోటల్‌ నుంచి అదృశ్యమయ్యాడు. తనతోపాటు పాస్‌పోర్టు కూడా తీసుకెళ్లాడు. అతడి వీసాకు నెలరోజుల గడువు ఉంది. ఈ ఘటనపై పాక్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ కర్నల్‌ నజీర్‌ అహ్మద్‌ స్పందించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇటలీలోని పాక్‌ దౌత్య కార్యాలయానికి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారని.. ఇప్పటి వరకు ఎవరితోనూ కాంటాక్ట్‌లోకి రాలేదని వెల్లడించారు. రషీద్‌ దేశానికి తలవంపులు తీసుకొచ్చాడని మండిపడ్డారు. వాస్తవానికి రషీద్‌ గతేడాది జరిగిన ఆసియాన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. కీలక టోర్నీ నుంచి ఆటగాడు అదృశ్యం కావడం కలకలం రేపింది.




 

రౌఫ్‌ కథ వేరు...

ఇటీవల పాకిస్థాన్‌ స్టార్ పేస‌ర్ హారిస్ రౌఫ్‌(Haris Rauf)కు పాక్‌ క్రికెట్‌ బోర్డు(PCB )దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు గాయం కారణంగా హారిస్ దూరంగా ఉన్నాడు. ఎలాంటి గాయం కాన‌ప్పటికీ ఉద్దేశ పూర్వకంతో హారీస్‌ ఆసీస్‌ ప‌ర్యటన నుంచి త‌ప్పుకోవ‌డంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత‌డిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంది. హరీస్‌ సెంట్రల్ కాంట్రాక్టును ర‌ద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు అత‌డు ఎటువంటి విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా చేసింది. అయితే ఇప్పుడు  లీగల్ టీమ్‌ సమీక్షించిన అనంతరం అతడి కాంట్రాక్టును పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు తెలిపాయి. తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని రవూఫ్‌ అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడకపోవడానికి దారితీసిన పరిస్థితులను లాయర్‌ ద్వారా వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘అతడి అభ్యర్థనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరించొచ్చని పీసీబీ వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఇటీవ‌ల పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో ప‌ర్యటించగా.. ఆఖ‌రి నిమిషంలో హారిస్ త‌ప్పుకున్నాడు. సిరీస్‌లో ఆడాల‌ని 10-15 ఓవ‌ర్లు బౌలింగ్ చేసినా చాలు అని టీమ్‌మేనేజ్‌మెంట్ అత‌డికి చెప్పిన‌ా హరీస్‌ అంగీకారం తెల‌ప‌లేదు. అత‌డికి ఎటువంటి గాయం కాలేదు. మెడిక‌ల్ బృందం కూడా అత‌డు ఫిట్‌గా ఉన్నాడ‌ని బోర్డుకు నివేదిక ఇచ్చింది. సిరీస్‌కు ఆడ‌కుండా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాడు. దీంతో పీసీబీ అత‌డిపై సీరియ‌స్ అయ్యింది. హరీస్‌ నుంచి వివ‌ర‌ణ కోరింది. ఈ స్టార్‌ బౌలర్‌ వివరణపై సంతృప్తి చెందని పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యపూర్వ‌కంగా త‌ప్పుకోవ‌డంతో పాటు స‌రైన వివ‌ర‌ణ ఇవ్వలేకపోయిన హరీస్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30, 2024 వ‌ర‌కు విదేశీ లీగుల్లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వమ‌ని చెప్పింది.