From wrestlers protest in Delhi to historic Olympic gold medal match: అవమానాలను దాటుకుంటూ... అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అంచనాలు నిలబెడుతూ వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat) అదరగొట్టింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని తాను కన్న కలను సాకారం చేసుకుంది. భారత్‌కు మరో పతకం ఖాయం చేసింది. విశ్వ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, కానీ రజతం కానీ ఖాయం చేసేసింది. గత రెండు ఒలింపిక్స్‌లో రిక్త హస్తాలతో వెనుదిరిగిన వినేశ్.. ఈసారి సాధికారత విజయాలతో ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్ క్యూబా రెజర్ల్‌పై 5-0తో విజయం సాధించి ఫైనల్‌ చేరింది. విశ్వ క్రీడల్లో భారత్‌కు మరో పతకం అందిస్తూ గత రెండు ఒలింపిక్స్‌లో సాధించలేనిది సాధించేందుకు వినేశ్‌ సిద్ధమైంది. ఇక వినేష్‌ స్వర్ణ వెలుగులు విరజిమ్మాలని దేశమంతా ఎదురుచూస్తోంది.










పతక సంబరం ఒలింపిక్స్ 2024 మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ 5-0 తేడాతో క్యూబా రెజ్లర్‌ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్‌ రికార్డు సృష్టించింది. వినేష్ ఫోగట్ రౌండ్‌ ఆఫ్‌ 16లో ప్రపంచ నెంబర్‌ వన్‌, డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ రెజ్లర్‌ యుయి సుసాకిపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. రౌండ్‌-16లో యుయిని 3-2తో వినేష్‌ ఫొగాట్‌ ఓడించింది. చివరి పది సెకన్లలో అద్భుతం చేసిన వినేశ్‌ ఫొగాట్... ప్రపంచ ఛాంపియన్‌కే షాక్‌ ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఉక్రెయిన్ ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. ఒక్సానా లివాచ్‌ను 7-5తో ఓడించింది. సెమీఫైనల్లో వినేష్... క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్‌మన్ లోపెజ్‌తో తలపడింది. సెమీస్‌లోనూ ఘన విజయం సాధించి ఒలింపిక్స్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేష్‌ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్‌‌లో అయితే ఏకంగా 5-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.


నాలుగో పతకం ఖాయం..


విశ్వ క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు 3 పతకాలు వచ్చాయి. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 22 ఏళ్ల మను భాకర్‌ కాంస్యం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్‌ సింగ్‌తో కలిపి భాకర్.. భారత్‌కు రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం కూడా షూటింగ్‌లోనే దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించాడు. తాజాగా వినేష్‌ ఫొగాట్‌ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్‌లో చేరడంతో భారత్‌ ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్వర్ణ పతకం కోసం పోరు బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణం.. ఓడిపోతే రజత పతకం దక్కనున్నాయి. ఏ పతకం దక్కినా.. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కానుంది.