ఆసియా క్రీడల్లో సత్తా చాటి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగు తేజాలు జ్యోతి సురేఖ, కోనేరు హంపి సొంత గడ్డపై కాలుపెట్టారు. కోనేరు హంపితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి  చేరకున్న జ్యోతి సురేఖకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జ్యోతి సురేఖకు డప్పు వాయిద్యాలతో క్రీడా సంఘాలు ఘన స్వాగతం పలికాయి.  19వ ఆసియా క్రీడల్లో  మూడు బంగారు పతకాలు గెలవడం ఆనందంగా ఉందని వెన్నం జ్యోతి సురేఖ  తెలిపారు. ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఇంత అద్భుతమైన స్వాగతం లభించడం ఏంటో ఆనందంగా అనిపించిందన్నారు.   ఏషియన్ గేమ్స్‌లో ఉమెన్ ఛాంపియన్‌షిఫ్‌ వెండి పతకం సాధించడం గర్వంగా ఉందన్న కోనేరు హంపి... మహిళల, పురుషుల విభాగాల్లో మెడల్స్ రావడం ఇదే మొదటిసారని తెలిపారు. 


 పతకాల పట్టికలో నాలుగో స్థానం
 చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో 107 పతకాలతో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇస్‌ బార్‌ సౌ పార్‌ నినాదాన్ని నిజం చేసింది. భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపారు. చైనాలోని హంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ ఏకంగా 107 పతకాలు పతకాలు సాధించగా.. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలున్నాయి. ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ పతకాల సంఖ్య 100 దాటి పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 16 రజతాలు, 20 కాంస్యాల మొత్తం 51 పతకాలతో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆసియా క్రీడల్లో మొదటి ఎడిషన్ నుంచి ఇప్పటివరకూ భారత్ మొత్తంగా 753 పతకాలను సాధించింది. ఇందులో 173 స్వర్ణాలు, 238 రజతాలు, 348 కాంస్యాలున్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు అధికంగా 254 పతకాలు రాగా, అందులో 79 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. రెజ్లింగ్, షూటింగ్ లలో వరుసగా 59, 58 పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. తాజా ఎడిషన్ లోనూ అథ్లెటిక్స్ లో భారత్ 30కి పైగా మెడల్స్ కైవసం చేసుకుని సత్తా చాటింది.


ఆసాధారణ ప్రదర్శన
 ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శనతో భారత బృందం గతంలో ఎన్నడూలేనన్ని పతకాలను కైవసం చేసుకుని.. చైనా గడ్డపై విజయ గర్జన చేసింది. జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలతో అదిరిపోయే ప్రదర్శన చేయగా లాంగ్‌ డిస్టాన్స్‌ రన్నింగ్‌లో అవినాశ్ ముకుంద్‌ సాబలే, హర్మిలన్‌ రెండేసి పతకాలు సాధించి సత్తా చాటారు. హాకీ, కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలతో భారత కీర్తిని నలుదిశలా వ్యాపించాయి.  25 స్వర్ణాలు , 35 రజత పతకాలు, 40 కాంస్య పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్‌ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కు చేరింది. కబడ్డీలో మహిళల జట్టు పసిడి పతకం సాధించడంతో భారత్‌ 100 పతకాల మైలురాయిని చేరుకుంది. ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.  


 చైనా, కొరియా, జపాన్‌కు దీటైన సవాల్‌ విసురుతూ ఆసియాడ్‌లో భారత్‌ దిగ్విజయంగా పతకాల వేట కొనసాగించింది. పదిహేను రోజుల పాటు ఆసియా గేమ్స్‌ అభిమానులను అలరించాయి. ఇందులో పతకాలు సాధించిన భారత ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే పారిస్‌(2024) ఒలింపిక్స్‌కు ముందు మెండైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకున్నారు.