Sunrisers Hyderabad And Mumbai Indians Teams Practice: ఐపీఎల్ (IPL)17 వ సీజన్ లో భాగంగా మార్చి 27 బుధవారం  సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.  రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై, హైదరాబాద్ టీమ్స్ సోమవారం రాత్రి భాగ్యనగరానికి చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్ల ప్లేయర్స్ హోటల్‌కు చేరుకున్నారు.   ఈ   వీడియోను   ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.  మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. సాయంత్రం వరకు ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేయనున్నారు.  సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ టిక్కెట్‌ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు.


పాండ్యపై మండిపడుతున్న నెటిజన్లు: 


ముంబై ఇండియ‌న్స్‌, హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌మ తొలి మ్యాచుల్లో ఓట‌మి చవిచూసిన విష‌యం తెలిసిందే. తొలిసారి ఎంఐ ప‌గ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు మొద‌టి మ్యాచులోనే ప‌రాజ‌యం ఎదురైంది. దీనితోపాటూ ఐపీఎల్‌(IPL)లో గుజరాత్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఫీల్డింగ్‌ స్థానాన్ని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని చెప్పిన హార్దిక్... తర్వాత హిట్‌మ్యాన్‌ను మ‌ళ్లీ లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు. హార్దిక్‌ ఆదేశాలతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రోహిత్ ఫ్యాన్స్.. ఇటు గుజరాత్ టైటాన్స్ అభిమానులు గట్టిగా అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. 


ఓటమి జీర్ణించుకోలేని అభిమానులు : 
గుజరాత్‌ చేతిలో ముంబై  పరాజయానికి హార్దిక్‌ కెప్టెన్సీ కూడా ఓ కారణమని మాజీలు విమర్శిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, బ్రెవిస్, తిలక్‌ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా ముంబైకి విజయం మాత్రం  దక్కలేదు. హార్దిక్‌ పాండ్యా బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్‌, కెవిన్ పీటర్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్‌ వేయడం సరైంది కాదని మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ చేస్తూ ఈ ముగ్గురు వ్యాఖ్యానించారు. తొలి ఓవర్‌ను బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్‌ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్‌ను బుమ్రా వేయకపోవడంపై ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రా ఎక్కడ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టిమ్‌ డేవిడ్‌ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు.