Virat Kohli joins elite list to achieve unique record in T20 cricket: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 కెరీర్‌లో వందో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో 100వ సారి 50 పరుగుల మార్కును దాటిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి టీ20లో 12 వేల పరుగులను అధిగమించాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2024(IPL)లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 12000 పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ విరాట్. టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 14,562 ప‌రుగులు చేశాడు. తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ 12,993 పరుగులు, కీర‌న్ పోలార్డ్ 12,430 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. 

 

 మ్యాచ్ లో కూడా తగ్గలేదు

ఇక గత రాత్రి జరిగిన మ్యాచ్ లో  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) బోణీ కొట్టింది. ఐపీఎల్‌(IPL) 17వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి వేదికగా పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో  బెంగళూరు విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 45 , జితేశ్‌ శర్మ 27,  సామ్‌ కరన్‌ 23, శశాంక్‌ 21 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో... సిరాజ్‌, మాక్స్‌వెల్‌ తలో రెండు తీయగా, యశ్‌ దయాల్‌, జోసెఫ్‌ ఒక్కోవికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 77 పరుగులతో వీరవిహారం చేశాడు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ 28, లామ్రార్‌ 17 చెలరేగి ఆడి బెంగళూరును గెలిపించారు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

 

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 77 పరుగులు బాదాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. పంజాబ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన విరాట్‌.. అర్ష్‌దీప్‌ వేసిన 4వ ఓవర్లో మూడు బౌండరీలు రాబట్టాడు. డుప్లెసిస్‌ , కామెరూన్‌ గ్రీన్‌ లు నిరాశపరిచినా రన్‌ మెషీన్‌ మాత్రం పరుగుల వేటను ఆపలేదు. రజత్‌ పాటిదార్‌ తో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. కోహ్లీ 35 పరుగుల వద్ద ఉండగా మరోసారి లైఫ్‌ లభించింది. కరన్‌ వేసిన 6వ ఓవర్లో రాహుల్‌ చాహర్‌ మిడ్‌ వికెట్‌ వద్ద క్యాచ్‌ మిస్‌ చేశాడు. రబాడ పదో ఓవర్లో మూడో బంతికి సింగిల్‌ తీయడంతో 31 బంతుల్లోనే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది.