RCB beat PBKS by 4 wickets: ఐపీఎల్‌(IPL) 17వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) బోణీ కొట్టింది. చిన్నస్వామి వేదికగా పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో  బెంగళూరు విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 45 , జితేశ్‌ శర్మ 27,  సామ్‌ కరన్‌ 23, శశాంక్‌ 21 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో... సిరాజ్‌, మాక్స్‌వెల్‌ తలో రెండు తీయగా, యశ్‌ దయాల్‌, జోసెఫ్‌ ఒక్కోవికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 77 పరుగులతో వీరవిహారం చేశాడు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ 28, లామ్రార్‌ 17 చెలరేగి ఆడి బెంగళూరును గెలిపించారు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలో రెండు వికెట్లు తీశారు. 


మ్యాచ్ ఎలా సాగిందంటే .. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ శిఖర్‌ ధావన్‌ మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే బౌండరీ సాధించాడు. మహ్మద్‌ సిరాజ్ వేసిన తొలి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. తొలి ఓవర్‌లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన యశ్‌ దయాల్  కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ దశలో ఎనిమిది పరుగులు చేసిన బెయిర్‌ స్టోను సిరాజ్‌ అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన బెయిర్‌ స్టో.. మూడో మూడో బంతికి కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్‌ స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 40 పరుగులకు చేరింది. తర్వాత శిఖర్‌ ధావన్‌ దూకుడు పెంచాడు. మయాంక్ దగార్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ఐదు సింగిల్స్‌ రాగా.. ధావన్‌ ఓ సిక్స్‌ బాదాడు. ఈ దశలో పంజాబ్‌ను మ్యాక్స్‌వెల్ దెబ్బకొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతికి ధావన్‌ ఫోర్ కొట్టగా నాలుగో బంతికి ప్రభ్‌సిమ్రాన్ సిక్స్ బాదాడు. తర్వాతి బంతికే 25 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ వికెట్ కీపర్‌ అనుజ్ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 72 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్‌  ధాటిగా ఆడేందుకు యత్నించాడు. 17 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌ను అల్జారీ జోసెఫ్‌ అవుట్‌ చేశాడు. తర్వాత కాసేపటికే 45 పరుగులు చేసిన ధావన్ ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ అవుటయ్యాడు. తర్వాత జితేశ్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. మయాంక్ దగార్‌ వేసిన 15 ఓవర్‌లో జితేశ్‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. 15 ఓవర్లకు స్కోరు 128/4. 17 బంతుల్లో 23 పరుగులు చేసిన శామ్‌ కరణ్‌ అవుటయ్యాడు. జితేశ్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు   చేసింది.