ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్‌ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. పురుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్‌ లోగోల‌ను విడుద‌ల చేసింది. ఇక ఈ ప్రపంచకప్‌నకే  హైలెట్‌గా నిలిచే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ న్యూయార్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కప్‌లో తలపడుతున్న పది జట్లలో కొన్ని జట్లు తమ గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడే అవకాశాలున్నాయి. వీటిలో భారత్‌, పాకిస్థాన్‌ ఉండొచ్చని తెలిసింది. 


భారత్‌కు న్యూయార్క్‌కు మధ్య కాలమానంలో పదిన్నర గంటలు తేడా ఉండడంతో భారత్‌లో అభిమానులకు అనువుగా ఉండేటట్లు ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. టోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్‌, అమెరికాల్లోని వేదికల్లో ఐసీసీ బృందం ఇప్పటికే పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించింది. విండీస్‌లో కొన్ని వేదికలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంది. 


2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి. 


వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించాలనే అభిప్రాయాలు ఎక్కువ మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి బీసీసీఐ సెక్రటరీ జై షా తొలిసారి స్పందించారు. మళ్లీ రోహిత్ టీ20 ఫార్మాట్లోకి పునరాగమనంపై జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ పునరాగమనంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని జైషా చెప్పారు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ జూన్‌లో జరగనుందని.... అంతకన్నా ముందు తమకు ఐపీఎల్, అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ ఉందని బీసీసీఐ కార్యదర్శి గుర్తు చేశాడు. బెంగళూరులో కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ వచ్చే ఏడాది ఆగష్టులో ప్రారంభం అవుతుందని జై షా వెల్లడించాడు.