ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ సారథ్య శకానికి ముగిసింది. అయిదు సార్లు ముంబైని విజేతగా నిలిపిన దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ముంబైతో హిట్‌మ్యాన్‌కు ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ముగిసింది. సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, హర్భజన్‌సింగ్‌ లాంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఐపీఎల్‌ టైటిల్‌ను అందించిన రోహిత్‌ శర్మను... కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించింది. తన అద్భుత నాయకత్వ పటిమతో పదేళ్ల కాలంలో ముంబైకి ఐదు ఐపీఎల్‌ టైటిళ్లతో పాటు ఛాంపియన్స్‌లీగ్‌ విజేతగా నిలిపిన హిట్‌ మ్యాన్‌ను ముంబై తప్పించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘ ఐపీఎల్‌ చరిత్రలో ముంబైకు ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన రోహిత్‌ను ఫ్రాంచైజీ పక్కకు తప్పిస్తూ హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.

 

గత రెండేళ్లుగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్‌ పంచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను హార్దిక్‌ నడిపిస్తాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. రోహిత్‌ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ గెలిచింది. 2013లో ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా చెన్నైతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం రోహిత్‌ శర్మ వల్లనే సాధ్యమైంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబయికి రోహిత్‌ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా మొత్తం 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. నాలుగు టై అయ్యాయి. మరోవైపు 2015లో ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి 2021 వరకు ముంబయితోనే ఆడిన హార్దిక్‌.. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌ అయ్యాడు. ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన జట్టు ఈ సారి రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల హార్దిక్‌ తిరిగి ముంబయి గూటికే చేరాడు.

 

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా..వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్‌ మొగ్గుచూపిందని ముంబై ఇండియన్స్‌ పర్ఫార్మెన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ మహేల జయవర్ధనె పేర్కొన్నాడు. సచిన్‌ నుంచి హర్భజన్‌సింగ్‌, రికీ పాంటింగ్‌ నుంచి రోహిత్‌శర్మ, ఇప్పుడు రోహిత్‌ నుంచి హార్దిక్‌కు నాయకత్వ బదిలీ జరిగిందని తెలిపాడు. అమోఘమైన సారథ్య నైపుణ్యాలు ప్రదర్శించిన రోహిత్‌ పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నామని.. 2013 నుంచి జట్టు కెప్టెన్‌గా అతని ప్రయాణం అసాధారణమని జయవర్దనే అన్నాడు. రోహిత్‌ అనుభవాన్ని ఉపయోగించుకుని జట్టును మరింత బలంగా మారుస్తామని.. ముంబయి కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌కు స్వాగతమని మహేల అన్నాడు.

 

జట్టు భవిష్యత్‌ కోసం రోహిత్‌తో సంప్రదించిన తర్వాతే ముంబయి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్‌ లాంటి ఆటగాడికి, నాయకుడికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సారథ్య బదలాయింపు సాఫీగా సాగాలని ముంబయి చూసింది. గతంలోనూ సచిన్‌ నుంచి హర్భజన్‌కు, పాంటింగ్‌ నుంచి రోహిత్‌కు ఇలాగే జట్టు పగ్గాలు దక్కాయి. మరోవైపు 2021, 2022లో ముంబయి ప్లేఆఫ్స్‌ చేరలేదు. ఈ ఏడాది రెండో క్వాలిఫయర్‌లో ఓడింది. ఇప్పుడీ నిర్ణయం వెనుక ఈ ప్రదర్శన కూడా ఓ కారణం కావొచ్చు. కానీ ఈ నిర్ణయాన్ని రోహిత్‌, ముంబయి ఇండియన్స్‌ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కెప్టెన్‌గా రోహిత్‌ లేని ముంబయిని చూడలేమంటున్నారు. నాయకుడిగా ఆ ఫ్రాంఛైజీపై రోహిత్‌ వేసిన ముద్ర అలాంటిది. కానీ ఇప్పుడు ముంబయి సారథిగా అతని ఘనమైన ప్రయాణం ముగిసింది.