భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఓ అరుదైన హోదాను సొంతం చేసుకుంది. 10 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువను దాటి డెకాకార్న్‌ హోదాను దక్కించుకుంది. 2008లో మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ  , అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది.  ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ 10.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.83,353 కోట్లు)కు చేరుకుంది.  గతేడాది (8.4 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే ఆ విలువ 28 శాతం అధికం అయ్యింది. ఇక ఐపీఎల్‌ ప్రారంభమైన  2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది. 16 సీజన్లు ముగిసి 17వ సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ మెగా లీగ్‌ బ్రాండ్‌ వాల్యూను బ్రాండ్‌ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్‌ ఫినాన్స్‌రివీల్స్‌ ఈ నివేదికను వెల్లడించింది. ఈ మెగా లీగ్‌ బ్రాండ్‌ వాల్యూ ‘డెకాకార్న్‌’ స్టేటస్‌ను దాటింది. ఒక సంస్థ విలువ పది బిలియన్‌ డాలర్లు దాటితే దానిని డెకాకార్న్‌ అని పేర్కొంటారు. అంటే ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ రూ. 89,236 కోట్లు.


 గతేడాది మీడియా హక్కుల కింద 6.2 బిలియన్‌ డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడం, కొవిడ్‌ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్‌ విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది. 2018, 2019లలో ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ వరుసగా 5.3 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు, 5.7 యూఎస్‌ బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అయితే కరోనా సమయంలో ఈ విలువ బాగా తగ్గిపోయింది. 2020, 2021లలో ఇది 4.4 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు, 4.7 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే ఐపీఎల్‌లోకి గుజరాత్‌ జెయింట్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల ఎంట్రీతో పాటు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆదాయం రెట్టింపయ్యింది. 


ఇక ఫ్రాంఛైజీల విషయానికి ఐదు సార్లు ట్రోఫీ కొట్టిన  ముంబయి ఇండియన్స్‌ 87 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.725 కోట్లు) ఉండగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ 81 మిలియన్‌ డాలర్లు (రూ.675 కోట్లు)తో రెండవ స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 78.6 మిలియన్‌ డాలర్లు (రూ.655 కోట్లు), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 69.8 మిలియన్‌ డాలర్లు (రూ.581 కోట్లు)  ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు తదుపరి స్థానాల్లో నిలిచాయి.  


త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా... వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా.... ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.  ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.