ఐపీఎల్‌ 2023 సీజన్ తొలి ఐదు మ్యాచుల్లోనూ ఒక్క విజయమూ లేక డీలా పడ్డ దిల్లీ క్యాపిటల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 16 లక్షల రూపాయల విలువైన కిట్ సామాగ్రి చోరీకి గురైంది. తర్వాతి మ్యాచ్ కోసం బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 


ట్రావెలింగ్‌లో బ్యాట్లు, ప్యాడ్లు, గ్లవ్స్ వంటి సామగ్రి మిస్ అయినట్టు తేలింది. దిల్లీలో తమ కిట్ బ్యాగ్స్ రూమ్ కు డెలివర్ అయిన వెంటనే సామాగ్రి మిస్ అయినట్టు ఆటగాళ్లు గుర్తించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ వి 3 బ్యాట్లు, బ్యాటర్ ఫిల్ సాల్ట్ వి మరో 3 బ్యాట్లు, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వి 2 బ్యాట్లు మిస్ అయ్యాయి.


అందరికన్నా ఎక్కువ ప్రభావం.... యంగ్ స్టర్ యష్ ధుల్ మీద పడింది. ఏకంగా 5 బ్యాట్లు తన కిట్ బ్యాగ్ నుంచి మిస్సింగ్. వీటితో పాటు షూస్, గ్లవ్స్ వంటివి కూడా చోరీకి గురయ్యాయి.


వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు, లాజిస్టిక్స్ డిపార్ట్ మెంట్, పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు దిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధులు చెప్తున్నారు. ఫిర్యాదు నమోదై విచారణ మొదలైంది. చోరీకి గురైనవాటిలో కొన్ని బ్యాట్లయితే ఒక్కోటి లక్ష రూపాయల దాకా ఉంటుందని అంచనా.


అయితే కోల్ కతా నైట్ రైడర్స్ తో తర్వాతి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా..... ఆటగాళ్ల మేనేజర్స్ బ్యాట్ మేకర్స్ తో వెంటవెంటనే కాంటాక్ట్ అయి... ఫ్రెష్ కిట్ ఏర్పాటు చేశారంట. ఐపీఎల్ లో ప్లేయర్స్ ఎక్విప్ మెంట్ ఈ రేంజ్ లో మిస్ అవడం ఇదే తొలిసారి. కిట్ బ్యాగ్స్ ను ఓ చోటు నుంచి ఇంకో చోటుకు తరలించే బాధ్యతను..... ఐపీఎల్ యాజమాన్యం... ఏదైనా లాజిస్టిక్స్ కంపెనీకి అప్పచెప్తుంది.