Captain Hardik Pandya Offers Puja: మరికొన్ని రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ipl) ప్రారంభంకానుంది. ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా... జట్టుతో కలిశాడు. మరో తొమ్మిది రోజుల్లోనే ఐపీఎల్‌ ప్రారంభంకానున్న వేళ... ముంబై జట్టుతో నూతన సారధి హార్దిక్‌ కలిశాడు. వచ్చి రావడంతోనే పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సొంత ఫ్రాంచైజీకి తిరిగి వ‌చ్చిన పాండ్య మొద‌ట దేవుళ్ల చిత్ర ప‌టం వ‌ద్ద, ముంబై కోచ్ మార్క్‌బౌచ‌ర్‌తో క‌లిసి దీపం వెలిగించాడు. పాండ్యకు అంద‌రూ ఘ‌న స్వాగతం ప‌లికారు.


వెనక ఇంత జరిగిందా..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది.  


అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున రోహిత్ ఆడటం చూడాలని ఉందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు  అభిప్రాయపడ్డాడు . ముంబై తరఫున చాలా కాలంపాటు రోహిత్‌ ఆడాడని ఇప్పుడు సీఎస్‌కేకు ఆడి విజయాల్లో పాలుపంచుకుంటే బాగుంటుందని అంబటి రాయుడు తెలిపాడు. ఈ ఏడాది రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగాల్సిందని.. వచ్చే ఏడాది హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించాల్సిందని.. ముంబై టీమ్ ఏదో తొందరలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఉందని అంబటి తెలిపాడు. రోహిత్‌కు సరైన పిలుపు వస్తుందని భావిస్తున్నానని. అయితే, అతడు తీసుకుంటాడో.. లేదో వేచి చూడాలని రాయుడు వ్యాఖ్యానించాడు.  రోహిత్ మరో ఐదారేళ్లు ఆడగలడని, అందువల్ల అతడిని సీఎస్కే తీసుకుంటే బాగుంటుందని అంబటి రాయుడు తెలిపాడు. 


ముంబైని విజయంవంతంగా నడిపి...
రోహిత్ శర్మ ముంబైకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై టైటిల్ గెలుచుకుంది. రోహిత్ వ్యక్తిగత ఐపీఎల్ ప్రదర్శనను గమనిస్తే అతను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. 243 మ్యాచ్‌ల్లో 6211 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏప్రిల్ 2008లో రోహిత్ తన ఫస్ట్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. డెక్కర్ ఛార్జ్స్ తరఫున రోహిత్ అరంగేట్రం చేశాడు. పాండ్యా గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు గత సీజన్లో ఆ జట్టు ఫైనల్స్‌కి కూడా చేరింది. హార్దిక్ వ్యక్తిగత ఐపీఎల్ ప్రదర్శనను పరిశీలిస్తే.. పాండ్యా ఇప్పటివరకు 123 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2309 పరుగులు చేశాడు. వీటితో పాటు 53 వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో హార్దిక్ 17 పరుగులిచ్చి 3 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీలో 10 హాఫ్ సెంచరీలు సాధించాడు.