ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు మరో విజయం. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం హైదరాబాద్ ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో నెట్ రన్‌రేట్ కూడా మెరుగు పడటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.


టాస్ ఓడి మొదటి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుపై సన్‌రైజర్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మార్కోజాన్సెన్.. డుఫ్లెసిస్ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్), విరాట్ కోహ్లీ (0: 1 బంతి), అనూజ్ రావత్‌లను (0: 2 బంతుల్లో) అవుట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత బెంగళూరు అస్సలు కోలుకోలేదు. ఒక్క బెంగళూరు బ్యాటర్ కూడా 15 పరుగులకు దాటి చేయలేకపోయాడు.


ప్రభుదేశాయ్ (15: 20 బంతుల్లో, ఒక ఫోర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) టాప్ స్కోరర్లు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, నటరాజన్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. జగదీష సుచిత్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఉమ్రాన్ మలిక్, భువనేశ్వర్ కుమార్‌లు చెరో వికెట్ తీశారు.


69 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (47: 28 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), కేన్ విలియమ్సన్ (16: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) దూకుడుగా ఆడారు. వీలైనంత త్వరగా మ్యాచ్ ముగించి నెట్ రన్‌రేట్ పెంచుకోవాలని వ్యూహంతో ఆరంభం నుంచే షాట్లు కొట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ  బౌండరీలతో చెలరేగాడు. లక్ష్యానికి కొద్ది పరుగుల ముందు అభిషేక్ శర్మ అవుటయినా... సిక్సర్‌తో రాహుల్ త్రిపాఠి (7: 3 బంతుల్లో, ఒక సిక్సర్) మ్యాచ్ ముగించాడు. ఎనిమిది ఓవర్లలోనే విజయం సాధించడంతో నెట్ రన్‌రేట్ మెరుగయింది. సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచింది.