ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మరో విజయం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది ఆరో విజయం కావడం విశేషం.


ముందుండి నడిపించిన కెప్టెన్..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు సరైన ప్రారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7: 5 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా (67: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన సాహాను 11వ ఓవర్లో ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. దీంతో పాండ్యాకు డేవిడ్ మిల్లర్ (27: 20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరూ చాలా వేగంగా ఆడారు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ కూడా పూర్తయింది. ఇన్నింగ్స్ కీలక దశలో ఇద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడం గుజరాత్ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. గత మ్యాచ్‌లో రాణించిన రషీద్ ఖాన్ (0: 2 బంతుల్లో) విఫలం అయ్యాడు.


చివరి ఓవర్లలో వేగంగా ఆడే రాహుల్ తెవాటియా (17: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) మ్యాజిక్ ఈసారి పనిచేయలేదు. ఆఖరి ఓవర్లో ఆండ్రీ రసెల్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. టిమ్ సౌతీ మూడు వికెట్లు తీయగా... ఉమేష్ యాదవ్, శివం మావి చెరో వికెట్ పడగొట్టారు. రసెల్ పడగొట్టిన నాలుగు వికెట్లు ఒకే ఓవర్లో రావడం విశేషం.


రసెల్ చితక్కొట్టినా...
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. స్కోరు బోర్డుపై 10 పరుగులు చేరేసరికి ఓపెనర్లు శామ్ బిల్లింగ్స్ (4: 4 బంతుల్లో, ఒక ఫోర్), సునీల్ నరైన్ (5: 5 బంతుల్లో, ఒక ఫోర్) పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), నితీష్ రాణా (2: 7 బంతుల్లో) కూడా విఫలం అయ్యారు. దీంతో 34 పరుగులకే కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో రింకూ సింగ్ (35: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (17: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) కోల్‌కతాను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరు 45 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో కోల్‌కతా మరోసారి కష్టాల్లో పడింది. కానీ ఆండ్రీ రసెల్ (48: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు) కోల్‌కతా ఆశలను సజీవంగా ఉంచాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా భారీ షాట్లు కొడుతూ రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సిన దశలో మొదటి బంతికే సిక్సర్ సాధించాడు. కానీ రెండో బంతికే అవుట్ కావడంతో గుజరాత్ విజయం లాంఛనం అయింది. కోల్‌కతా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.