ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (67: 52 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 120 బంతుల్లో 159 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ మందకొడిగా ఆరంభం అయింది. స్కోరు బోర్డుపై 26 పరుగులు రాగానే హృతిక్ షౌకీన్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (15: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శామ్సన్ (16: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో రెండు సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు.


జోస్ బట్లర్, డేరిల్ మిషెల్ (17: 20 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ నిదానంగా ఆడటంతో స్కోరు మందకొడిగా ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే డేరిల్ మిషెల్ కూడా అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వరకు జోస్ బట్లర్ స్ట్రైక్ రేట్ కూడా 100 దాటలేదు. హృతిక్ షౌకీన్ వేసిన 16వ ఓవర్లో మొదటి నాలుగు బంతులకు సిక్సర్లు కొట్టిన బట్లర్ చివరి బంతికి అవుటయ్యాడు.


రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఈ ఓవర్ ఊపిచ్చినా దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. రియాన్ పరాగ్ (3: 3 బంతుల్లో) విఫలం అయినా... రవిచంద్రన్ అశ్విన్ (21: 9 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. చివరి ఓవర్లో షిమ్రన్ హెట్‌మేయర్ (6: 14 బంతుల్లో) నాలుగు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హృతిక్ షౌకీన్, రైలే మెరెడిత్ రెండేసి వికెట్లు తీశారు. డేనియల్ శామ్స్, కుమార్ కార్తికేయలకు చెరో వికెట్ దక్కింది.